చంద్రబాబుకు ఝలక్, వారికి జగన్ వల!: వైసీపీలోకి టీడీపీ నేత తనయుడు
అమరావతి/విజయవాడ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. ఇటీవలి వరకు వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు పలువురు నేతలు టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి వస్తున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ దెబ్బ: బాబుకు జగన్ ఊహించని షాక్ వెనుక అసలు ఉద్దేశ్యం!
తన పాదయాత్ర సమయంలోను పలువురిని ఆకర్షించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేత, మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు తనయుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. ఆయన వైసీపీలో చేరుతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సోమవారం ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీలో చేరుతున్నా: వసంత
తాను త్వరలో వైసీపీలో చేరుతున్నానని వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో చేరతానని తెలిపారు. చేరే తేదీ, సమయం, వేదికను తర్వాత ప్రకటిస్తానన్నారు. అనంతరం పూర్తిస్థాయిలో పని చేస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా జగన్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.
దేవినేనిపై పోటీ చేస్తారా?
కృష్ణ ప్రసాద్తో గత కొంతకాలంగా టీడీపీ నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో చాలా రోజుల పాటు ఊగిసలాట చోటు చేసుకుంది. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన మైలవరం నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ హామీ మీదే ఆయన వైసీపీలో చేరుతున్నారట.
ప్రస్తుతం జోగి రమేష్ ఇంచార్జ్
ప్రస్తుతం మైలవరం ఇంచార్జిగా జోగి రమేష్ ఉన్నారు. జోగి రమేష్ మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన 2009లో పెడన నుంచి పోటీ చేసి గెలిచారు. వైయస్ మృతి అనంతరం ఆయన వైసీపీలో చేరారు. అప్పటి నుంచి మైలవరంపై దృష్టి సారించారు. 2014లో దేవినేనిపై పోటీ చేసి ఆరువేల ఓట్లతో ఓడిపోయారు.
మరికొందరు వైసీపీలోకి
ఇదిలా ఉండగా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల 2014లో తెలుగుదేశం పార్టీలో చేరవలసి వచ్చిందని కన్నబాబు వేరుగా అన్నారు. కన్నబాబు కూడా పార్టీ మారుతారని అంటున్నారు. వైసీపీలో చేరుతారని అంటున్నారు. పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు. మరోవైపు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సీటును ఎన్నారైలకు ఇచ్చేందుకు వైసీపీ చూస్తోందనే ప్రచారం సాగుతోంది.