వైసిపి బంద్:అదే రోజు పవన్ కీలక భేటీ...ఇద్దరిపై టిడిపి పంచ్!...
అమరావతి:వైసిపి-జనసేన ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉండొచ్చు?...ఈ దశలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎవరికైనా కష్టమే...అంతకుముందు విషయాల సంగతి అటుంచితే....గత కొన్ని రోజులుగా జగన్ కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలకు సంబంధించి మంగళవారం మరో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకోబోతోంది. అదేమిటంటే?...ఎపికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి-టిడిపి అన్యాయానికి నిరసనగా ఈనెల 24న ఎపి బంద్ పాటించాలని వైసిపి అధినేత జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదేరోజున వైకాపా బంద్ అని తెలిసి కూడా జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఎపికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బిజెపి చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా, తెలుగు దేశం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 24న ఎపి బంద్ పాటించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. ఈ బంద్కు అన్ని పార్టీలు, సంఘాలు సహకరించాలని, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని జగన్ కోరారు. అయితే అదేరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కొన్ని కార్యక్రమాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గత కొంత కాలంగా ప్రజా పోరాట యాత్ర చేస్తూ ప్రస్తుతం విరామంలో ఉన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ మళ్లీ తన పర్యటన కొనసాగించే క్రమంలో సోమవారం సాయంత్రానికి భీమవరం చేరుకోనున్నారు. ఈ విడత పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన తలపెట్టిన ఆయన జూలై 24న అక్కడ ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆరోజు వైసిపి రాష్ట్ర బంద్కు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో...పవన్ కళ్యాణ్ కూడా అదేరోజు భీమవరం కేంద్రంగా జనసేన పార్టీ కేడర్, ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆదివారం తనను కలిసిన తమ పార్టీ సీనియర్లతో స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేయడం ఖాయమని, అదికూడా ముఖ్య నేతలతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని పవన్ వారితో చెప్పారట. వాస్తవానికి పవన్ పర్యటనను ఖరారు చేసేందుకు వీలుగా గడచిన మూడు రోజులుగా జిల్లా నేతలంతా పడిగాపులు పడ్డారు. పార్టీ అధినేత నుంచి సంకేతం రాగానే ఏర్పాట్లకు సిద్ధం కావాలని తలపెట్టారు. కానీ 24న వైసిపి బంద్...మరోవైపు ఈనెల 26న సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా పవన్ పర్యటనకు భద్రత ఇవ్వడం కష్టంగా ఉంటుందని పోలీసు వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో పవన్ ఆ జిల్లాకు చేరుకుని, నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సంభాషించిన తరువాత ఎక్కడెక్కడ పర్యటించాలనే విషయమై ఒక నిర్ధారణకు రావాలని భావిస్తున్నారుట. అయితే అదేరోజు వైసిపి బంద్ కావడమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన చర్య జర్చనీయాంశం కావడానికి కారణమైంది. ఇదిలావుంటే ఈనెల 28 లేదా 29 నుంచి జిల్లాలో పవన్ పర్యటన నిరవధికంగా ఉంటుందని సీనియర్లు చెబుతున్నారు. దానికి రూటు మ్యాప్ ఖరారు చేసేందుకే ఈ సమావేశమనేది వారి వాదన.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రికి పవన్ భీమవరంలోనే బస చేయబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించి ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది నేరుగా భీమవరం చేరుకుని, ఆయన బస చేసే ప్రాంతం, తీసుకోవాల్సిన భద్రతపై సమీక్షించబోతున్నారు. అనంతరం పవన్ విజయవాడ నుంచి నేరుగా సోమవారం సాయంత్రం కల్లా భీమవరం చేరుకుంటారని తెలిసింది.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ను ప్రజలు అసలు పట్టించుకోరని టీడీపీ నేత కళావెంకట్రావు తేల్చేస్తున్నారు. జూలై 24 న వైసీపీ బంద్పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో ఒకవైపు వైసిపి అంటకాగుతూ మరోవైపు హోదాపై పోరాటం అంటే ఆ పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్కు రాజకీయ విధానమంటూ లేదని, ట్విట్టర్లో ఏదో ఒకటి అంటే సరిపోదని ఆయన ఎద్దేవా చేశారు. హోదా, విభజన హామీలపై టీడీపీ పోరాటం కొనసాగుతుందని కళావెంకట్రావు స్పష్టం చేశారు.