ఐఏఎస్లు ఎందుకు, పోస్ట్లన్నీ తీసుకో: బాబుకు వైసిపి, రాజధాని ప్లాట్లపై ట్విస్ట్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి నేతలు వాసిరెడ్డి పద్మ, ఆళ్ల నానిలు బుధవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారని వాసిరెడ్డి ఆరోపించారు. తన మాట వింటేనే అధికారులు మనగలుగుతారన్న రీతిలో సీఎం ఆయన తీరు ఉందన్నారు.
టిడిపి ఎమ్మెల్యేలు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. అన్ని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవాలని చూసే టిడిపి నేతల ధోరణితో ఏపీ నష్టపోయే పరిస్థితి వస్తోందన్నారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులని ప్రభుత్వ నేతలు తమకు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారన్నారు.
రైతులకు కమర్షియల్ ప్లాట్లు డిమాండ్ చేస్తున్న వైసిపి
అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు ప్రకటించారని, ఇప్పుడు మాత్రం అలా ఇవ్వడం లేదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు. విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్న 1500 ఎకరాలలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కమర్షియల్ ప్లాట్లు ఇస్తున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టి, తెల్ల కాగితాల మీద నెంబర్లు వేసి తూతూమంత్రంగా కొంతమందికి ఇచ్చారని, తర్వాత వర్షం వస్తోందని వాయిదా వేశామని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు చెప్పిన మాయమాటలు నమ్మి అందరూ మోసపోయారన్నారు.
ఎక్కడైనా ప్రభుత్వం - ప్రయివేటు భాగస్వామ్యం లాంటి ఒప్పందాలు జరిగితే హక్కుదారులకు ఎక్కువ వాటా, వ్యాపారులకు తక్కువ వాటా ఉంటుందని పాయింట్ లాగారు. ఇక్కడ మాత్రం 58 శాతం విదేశీ కంపెనీలకు, కేవలం 42 శాతం మాత్రం సీఆర్డీఏ వాళ్లకు ఇస్తామని చెబుతున్నారని, ఇదేమిటని ప్రశ్నించారు.
అంతేకాకుండా, ఆ 58 శాతంలో కొంత మొత్తాన్ని ఎవరికైనా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చునని చెబుతున్నారన్నారు. ఇది ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు పదేపదే చెబుతున్న స్విస్ ఛాలెంజ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెరతీశారని, సాధారణంగా కింద నుంచి పైకి ఫైళ్లు వెళ్లాలని, కానీ ఇక్కడ మాత్రం ముందు సంతకం చేసి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపుతారని, ఆ మాత్రం దానికి ఐఏఎస్, ఐపీఎస్ల వంటి అధికారులు ఎందుకని, అన్ని పోస్టులు చంద్రబాబే తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
ముద్రగడకు ఇష్టం లేదు: చినరాజప్ప
కాపులను బీసీల్లో చేర్చడం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ఇష్టం లేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఎవరు అడగకముందే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ అంశానికి సంబంధించి మంజునాథ కమిటీ నివేదిక వచ్చేంత వరకు ముద్రగడ ఎందుకు ఆగలేకపోతున్నారని ప్రశ్నించారు. ముద్రగడ కొంచెం ఓపిక పట్టాలన్నారు.