ఆ తర్వాతే పొత్తు వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వల్లే, బాబుతో పొత్తు కోసం ఎవరొస్తారు: వైసీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాతే టీడీపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ జనసేనతో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారా? ఈ విషయంలో చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
బాబు 'సాఫ్ట్', 'హార్డ్' అస్త్రాలు:పవన్ కళ్యాణ్కు అక్కడ ఎలా చెక్ చెప్పాలి!? వైసీపీలో క్రెడిట్ గుబులు
ఆ తర్వాతే టీజీ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో
చంద్రబాబుతో భేటీ తర్వాతే టీజీ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. కానీ జనసేనాని ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసేసరికి చంద్రబాబు ఒక్కసారిగా ప్లేటు పిరాయించారని ఎద్దేవా చేశారు. టీజీ వెంకటేష్ పైన అసహనం అంటూ చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నప్పటికీ విజయం మాత్రం తమ పార్టీదే అన్నారు.
చంద్రబాబుకు భయమెందుకు?
విశాఖపట్నం విమానాశ్రయంలో తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వాసిరెడ్డి ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తమ పాత్ర బయటపడుతుందని వారు భయపడుతున్నారేమోనని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును నమ్మి పొత్తు కోసం ఏ పార్టీ రాదు
చంద్రబాబు నాయుడును నమ్మి పొత్తుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రయత్నాలు చేయదని జనసేన - టీడీపీ పొత్తు వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబు అన్నారు. జనసేన పైన చంద్రబాబు వన్ సైడ్ లవ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును నమ్మి పొత్తు పొట్టుకుంటే వెలుగు అనుకొని మంటల్లో పడినట్లే అన్నారు. ప్రజలను తమ వైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.
జనసేన స్పందించాలి
రాజకీయ ప్రయోజనాల కోసమే అనేక కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నారని అంబటి చెప్పారు. ఈబీసీల రిజర్వేషన్లలో కాపులకు ఇవ్వవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లపై ముఖ్యంగా కాంగ్రెస్, జనసేన పార్టీలు స్పందించాలని డిమాండ్ చేశారు. కనీసం కానిస్టేబుల్ను కూడా బదలీ చేయలేని పరిస్థితిలో కాపు మంత్రి ఉన్నారని చినరాజప్పను ఉద్దేశించి అన్నారు.