సీఎం రమేష్ను ఇరికిస్తారని 'ఛీ'బీఐ, జగన్ మాటేంటి: పద్మ, జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్య
అమరావతి: సీబీఐని దశాబ్దాలుగా పలు పార్టీలు భ్రష్టుపట్టించాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మంగళవారం నిప్పులు చెరిగారు. సీబీఐని ఛీబీఐ అంటున్న వారికి నాడు వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
నాడు సీబీఐని పొగిడి, ఇప్పుడు తమ పార్టీ ఎంపీ సీఎం రమేష్ను కాపాడుకునేందుకు ఛీబీఐ అంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ దోషి కాదని మీడియా ఎందుకు ప్రచారం చేస్తోందని నిలదీశారు. రెండేళ్ల క్రితం సీబీఐని కీర్తించినవారు ఇప్పుడు తప్పుబట్టడం విడ్డూరమన్నారు. అన్ని పార్టీలు కలిసి సీబీఐలో తన మనుషులనే అరెస్ట్ చేసే దుస్థితికి తీసుకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యనమలే కాంట్రాక్టర్, బాబూ! సీఎం నువ్వానేనా: జగన్ సంచలనం, శ్రీకాకుళం ఎందుకు వెళ్లలేదంటే?
రాజకీయ అవసరాల కోసం సీబీఐని వాడుకుకున్నారు
సీబీఐని పార్టీలు రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాయని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే తాము ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పామని అన్నారు. ఇదే ఎల్లో మీడియా గతంలో సీబీఐని ఆకాశానికి ఎత్తిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే ఎల్లో మీడియా ఛీబీఐ ఆంటోందని గుర్తు చేశారు.
Recommended Video
సీఎం రమేష్ను ఇరికిస్తారని ఛీబీఐ అయిందా
సీఎం రమేష్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని నిన్నటి వరకు ఉన్న సిబిఐ ఇప్పుడు ఛీబీఐ అయిందా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. దర్యాఫ్తు సంస్థలను స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం చంద్రబాబుపై తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీబీఐకి ఫిర్యాదు చేస్తే కోర్టుకు వెళ్లే వరకు ఏం చేయలేదని గుర్తు చేశారు.
కోర్టు చెప్పినా చంద్రబాబుపై సోదాల్లేవు
ఆనాడు కోర్టు ఆదేశాలు జారీ చేసినా చంద్రబాబుపై సీబీఐ సోదాలు నిర్వహించలేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. అదే వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు అత్యుత్సాహం చూపారని ప్రశ్నించారు. సీబీఐని భ్రష్టు పట్టించిన వ్యక్తులపై నిజాలు నిగ్గు తేలాల్సి ఉందని చెప్పారు. దర్యాఫ్తు సంస్థలు నిష్పక్షపాతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జేడీ లక్ష్మీనారాయణను లాగిన వాసిరెడ్డి పద్మ
టీడీపీ చేపడుతున్న తుఫాను సహాయక చర్యలు భేష్ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనడంలోనే ఆయనకు, చంద్రబాబుకు మధ్య ఉన్న బంధం తేటతెల్లమవుతోందని వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కేసు విషయంలో లక్ష్మీనారాయణ అమానవీయంగా వ్యవహరించి, ఇప్పుడు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తే మీ బంధాలు బయటపడటం లేదా అని ప్రశ్నించారు.
జగన్ను అణిచివేయాలని
చంద్రబాబు పాలనలో పంచాయతీలు మగ్గిపోయాయని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. చంద్రబాబు ఎన్నో దర్యాఫ్తు సంస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఆయన ఆదేశాల మేరకే ఎర్రన్నాయుడు, శంకర్రావులు నాడు జగన్ పైన కేసు పెట్టారన్నారు. జగన్ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించారని కాశ్మీర్కు చెందిన నాటి జడ్జిని ఏపీలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమించారన్నారు. అధికారంలో ఉన్న పార్టీలతో కలిసి జగన్ను అణిచివేయాలని చంద్రబాబు చూశారన్నారు.