అంతా మోసం, అన్నివేళ్లూ బాబు వైపే! టీడీపీ ఎంపీలకే నంది అవార్డులు: వాసిరెడ్డి నిప్పులు
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం జరిగిన నాటి నుంచి చంద్రబాబు కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రజలకు తన ముఖం కూడా చూపలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అనరని, టీడీపీ ఎంపీలు అన్నట్లుగా ఏవో డ్రామాలాడిస్తున్నారని చెప్పారు.
అన్ని వేళ్లూ బాబు వైపే
అసమర్థ చంద్రబాబు కారణంగా ఆరు కోట్లమంది రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయానికి కారణం ఎవరంటే.. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపుతున్నాయని అన్నారు. డ్రామాలాడుతూ టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రులు వంచన చేస్తున్నారని మండిపడ్డారు.
నంది అవార్డులు వారికే
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నంది అవార్డులను టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. నటనలో వీరంతా సినీ నటులనే మించిపోయారని అన్నారు.
బాబుది వెన్నుపోటు చరిత్ర
చంద్రబాబు గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వెనకేసుకొస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదని అన్నారు. చంద్రబాబుదంతా వెన్నుపోటు చరిత్రేనని అన్నారు.మామ, బావమరిది, తమ్ముడిని కూడా చంద్రబాబు మోసం చేశారని అన్నారు.
బీజేపీ నెట్టేస్తున్నారు
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ అన్యాయం చేసిందని ఆ పార్టీపై నెపం నెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును చూసే ఢిల్లీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని అన్నారు. చంద్రబాబు మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీతో తెగదెంపులు అంటున్నారని చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నాలుగేళ్లుగా బీజేపీతో మిత్రపక్షంగా ఉండి.. ఇప్పుడు తెగదెంపులు ఎందుకంటున్నారని ప్రశ్నించారు. అవతలి వాళ్ల మీద నెపం నెట్టడం బాబుకు అలవాటేనని అన్నారు.
అది టీడీపీ జాతీయ విధానం
బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబే మోసం చేశారని అంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. మాట ఇచ్చి తప్పడం టీడీపీ జాతీయ విధానమని ఆమె దుయ్య బట్టారు. ఏపీకి జరిగిన నష్టానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక క్షమించరు
చంద్రబాబునాయుడు తన సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారని వాసిరెడ్డి ఆరోపించారు. గత 12రోజులుగా చంద్రబాబు ప్రజలతో మాట్లాడటం లేదని అన్నారు. హిట్లర్ కారణంగా జర్మనీ జాతి నష్టపోతే.. బాబు వల్ల ఏపీ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. బాబును గానీ, టీడీపీని గానీ ఏపీ ప్రజలు భరించే స్థితిలో లేరని వాసిరెడ్డి స్పష్టం చేశారు. చొక్కాలు చించుకున్నా.. గుండు కొట్టించుకున్నా.. ప్రజలు క్షమించరని అన్నారు.