150 ఎకరాల కోసం ఇంత దారణమా?: సుజయ కృష్ణపై పద్మ
హైదరాబాద్: 150 ఎకరాల భూమి కోసమే బొబ్బిలి ప్రజల ఆత్మ గౌరవార్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తాకట్టు పెట్టారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం ఆమె వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
బొబ్బిలి రాజుల వంశ గౌరవం నిలవాలంటే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుజయ కృష్ణ రంగారావును నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని, అలాంటిది టీడీపీ కండువాలు కప్పుకుంటే నియోజకవర్గాలా అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను సీఎం చంద్రబాబు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని స్యయంగా సుజయ కృష్ణ రంగారావు చెప్పడం చాలా బాధాకరంగా ఉందని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఆమె చెప్పారు.
ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి తలెత్తుతోందని ఆమె అన్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ నెల 23న సెవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, సేవ్ డెమోక్రసీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని చెప్పారు.
ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు జీవితమంతా అవినీతిమయ రాజకీయమేనని దుయ్యబట్టారు. ఎవరైనా పుట్టిన రోజు నాడు మంచి పని చేయాలనుకుంటారు, కానీ చంద్రబాబు పుట్టినరోజునాడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని మండిపడ్డారు.
ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం రాజకీయమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతు, రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పుకోచ్చిన చంద్రబాబు.. వందల హామీలను మ్యానిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసుకున్నారంటూ విమర్శించారు.