షాకింగ్: 'మరోసారి ప్యాకేజీ అంగీకారానికి బాబు రెడీ, కేసీఆర్ వద్ద అలా లొంగిపోయారు'
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి తలొగ్గి ప్యాకేజీ అంగీకరించేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.
తెరపైకి జూ.ఎన్టీఆర్, తెలంగాణలో టీడీపీ ఉంటుంది: బాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్తో పొత్తుపై..
ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 5న పార్లమెంటు వీధుల్లో తాము నిరసనలు చేపడుతున్నామన్నారు. విజయవాడ నుంచి వైసీపీ శ్రేణులు వెళ్తున్నాయన్నారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఆరోపించారు. కేసుల భయం, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు.
తెలంగాణ వద్ద లొంగిపోయారు
ఏపీకి రావాల్సిన నీటి విషయంలోను తెలంగాణ దగ్గర చంద్రబాబు లొంగిపోయారని వాసిరెడ్డి పద్మ అన్నారు. చంద్రబాబు తెరాసతో పొత్తుకు తహతహలాడుతున్నారన్నారు. కాల్ మనీ కేసులో అధికార పార్టీ వారే ఉన్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి రావడం లేదని, కానీ తాము డబ్బా కొట్టుకోవడం కోసం రూ.75 లక్షలు ఖర్చు చేస్తున్నారని వాసిరెడ్డి మండిపడ్డారు. గోదావరి పుష్కరాల సమయంలోనే ఇలాంటి ప్రచార యావతో భక్తులు చనిపోయారన్నారు.
దాసోహం అనకుండా పోరాడాలి
చంద్రబాబు ఇప్పటికైనా ఢిల్లీకి దాసోహం అవకుండా, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. చంద్రబాబు కళ్లు తెరిచి హోదా కోసం కట్టుబడి ఉండాలన్నారు. తాము అవిశ్వాస తీర్మానం, రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏం అడుగు వేశారని ఆఖరి అస్త్రం
అవిశ్వాస తీర్మానం ఆఖరి అస్త్రమని చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం మొదటి అడుగు వేశారని, ఆఖరి అస్త్రమని చెబుతారని నిలదీశారు. టీడీపీ, బీజేపీలు కలిసి ఏపీని నిండా ముంచాయన్నారు.
ఎక్కడదాకైనా వెళ్తాం
ఏపీ ప్రయోజనాల కోసం తాము ఎక్కడకైనా వెళ్తామని వాసిరెడ్డి అన్నారు. ఆఖరి అస్త్రం, జమ్మిచెట్టు మీద ఆయుధాలు పెట్టామనే మాటలు చెప్పవద్దని చెప్పారు. మార్చి 5న హోదా కోసం పార్లమెంటు వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.