పీకేపై అంత మాటా?: వైసీపీ నేత సంచలన కామెంట్స్.. అసంతృప్తి పెరుగుతోందా?
నంద్యాల ఫలితాలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెంప పెట్టులాంటివని అన్నారు.
హైదరాబాద్: ఏరి కోరి మరి నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకున్నట్లే కనిపిస్తోంది. పీకే ఇచ్చే రిపోర్టులు, సర్వేల ఆధారంగా తమ రాజకీయ సామర్థ్యాన్ని లెక్కగట్టడం వారికి నచ్చకపోవడం ఇందుకు ఓ కారణమైతే.. ఆయనొచ్చాక జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం మరో కారణం.
బహుశా ఓటములను ఇంకెంతకాలం సమర్థించుకుంటామన్న అంతర్మథనం వైసీపీ నేతల్లో మొదలైనట్లుగానే కనిపిస్తోంది. అందుకేనేమో.. సాక్షి చానెల్ లైవ్ షోలోనే వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ తన అసహనాన్ని బయటపెట్టారు. 'నంద్యాల ఫలితాలు ప్రశాంత్ కిషోర్ కు చెంపపెట్టు' అని ఆమె వ్యాఖ్యానించడం పార్టీ వర్గాలనే షాక్కు గురిచేసేలా మారాయి.
కొమ్మినేని షోలో పాల్గొన్న వాసిరెడ్డి పద్మ.. నంద్యాల ఫలితాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలతో అవాక్కయిన కొమ్మినేని శ్రీనివాసరావు.. అదేంటి అంత మాటనేశారని ప్రశ్నించగా.. దానికి కూడా వాసిరెడ్డి పద్మ గట్టి కౌంటరే ఇచ్చారు.
బీహార్, ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసిన వ్యూహాలు దక్షిణాదిలో పనిచేయవని ప్రశాంత్ కిశోర్ గుర్తించాలని సూచించారు. ఆపై పీకే ఢిల్లీ వెళ్తున్నారట కదా.. ఇకపై పార్టీతో పనిచేయరట కదా.. అంటూ కొమ్మినేని ఆరా తీశారు. ఈ విషయంలో మాత్రం ఆమె పాజిటివ్ గానే స్పందించారు. అలాంటిదేమి లేదని 2019దాకా పీకే పార్టీతోనే ఉంటారని, ఆయన వ్యూహాలను మాత్రం సరిచేసుకోవాలని ఆమె సూచించారు.