ప్రపంచం ఉలిక్కిపడింది, హైద్రాబాద్ కంటే మిన్నగా: బాబు, మైసూరా ఫైర్
గుంటూరు: అమరావతి పేరును రాజధానిగా ప్రకటించడంతో ప్రపంచం ఉలిక్కిపడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. రాజధాని వాస్తు బలంతో ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఏం చేయలేదన్నారు. ప్రపంచ దేశాల్లోనే దీటైన రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాదు నగరానికి మిన్నగా మూడు నగరాలను తయారు చేస్తానని చెప్పారు.
గుంటూరు జిల్లా వంకాయలపాడులో సుగంధ ద్రవ్యాల పార్కు ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గుంటూరు అంటే గుర్తొచ్చేది ఘాటైన మిరపని అన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో రైతులు ముందుకెళ్లాలన్నారు. రైతు శ్రేయస్సు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు పండించి లాభాలలో దూసుకుపోదామన్నారు. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయన్నారు. 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముందని చెప్పారు. చేపలు, రొయ్యల పెంపకంలో అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు మత్స్య సంపదను సరఫరా చేసే స్థాయికి ఎదగాలన్నారు. సముద్రంలోకి పోయే నీటిని పొలాలకు తరలించి బంగారం పండిస్తామన్నారు.
రైతులు అధికంగా ఎరువులు, పురుగుల మందు వాడటం వల్ల ప్రపంచ దేశాల్లో మన సరకు దిగుమతికి వెనుకడుగు వేస్తున్నారన్నారు. శాస్త్రసాంకేతికతకు వ్యవసాయాన్ని జోడిద్దామన్నారు. తాను రాబోయే రెండు మూడు నెలల్లో పొలాలు, కాల్వ గట్ల వెంబడి తిరుగుతానని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
దేశంలో మిరప ఎగుమతుల్లో 65 శాతం గుంటూరు నుండే జరుగుతోందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇంకా రావాలన్నారు. గుంటూరు జిల్లాలో మిరప వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఏపీ మరింత ముందుకెళ్తోందన్నారు. ఎప్పటి పెండింగులో ఉన్న సుగంధ ద్రవ్యాల పార్క్ ఈరోజు ప్రారంభమైందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్న సింగపూర్కు చెందిన జాన్సన్ అభినందనీయులన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అడ్వయిజరీ కమిటీ వేసి శాసన సభాపతి కోడెల శివప్రసాద్ రావును కన్వీవర్గా, జాన్సన్ను కో కన్వీనర్గా నియమిస్తామన్నారు.
ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారు: మోసూరా
కృష్ణా డెల్టా, సీమకు నీరు ఇస్తున్నట్లు జీవోలో లేదని వైసీపీ నేత మైసూరా రెడ్డి వేరుగా అన్నారు. సీమ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాయలసీమ పట్ల ప్రభుత్వానికి శీతకన్ను ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వాస్తవాలు వక్రీకరించి మాట్లాడటం సరికాదన్నారు.
నీటి ప్రాజెక్టుల పైన సీమన నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకు వచ్చిన ప్రభుత్వం.. పోలవరంను ప్రశ్నార్థకం చేస్తుందనేదే తమ భయమన్నారు.
రాయలసీమకు నీరిచ్చేందుకే పట్టిసీమ అని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ప్రాజెక్టు నుండి రాయలసీమకు నీళ్లు తరలిస్తామి జీవోలో ఎందుకు లేదన్నారు. ఇంతకంటే మోసం, దగా ఉండదన్నారు. టీడీపీ హయాంలో తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. మద్రాస్కు నీటిని తరలించాలనే ధ్యాసతో సీమను ఎడారి చేసే ప్రయత్నం చేశారన్నారు.