సీమాంధ్ర మంత్రితో చర్చ స్టార్ట్: బిల్లు చించిన జగన్ పార్టీ
వట్టి మాట్లాడుతుండగా వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాల, గందరగోళం మధ్యనే వట్టి తన చర్చను కొనసాగించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వట్టి అన్నారు. విభజనతో ఆర్థికంగా, నదీజలాల సంక్షేమం విషయంలో లెక్కలేనంత నష్టం వాటిల్లుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలు దీనిని ఆమోదించరని చెప్పారు. విభజనతో సీమాంధ్రకు మరింత నష్టమన్నారు.
కాగా, వట్టి మాట్లాడుతూండగా నినాదాలు చేస్తున్న సభ్యులను సభాపతి సముదాయించే ప్రయత్నాలు చేశారు. స్పీకర్ కోరడంతో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభ్యులు వెనక్కి వెళ్లి తమ సీట్లలో కూర్చున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు బిల్లు ప్రతులను చించివేసి గాల్లోకి విసిరేశారు. గందరగోళంగా ఉండటంతో సభాపతి సభను గురువారానికి వాయిదా వేశారు.
చర్చ ప్రారంభానికి ముందు ఆనం మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేద్దామని, చర్చకు అందరూ సహకరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వం ఇస్తుందన్నారు. విభజనపై లాభ, నష్టాలను చర్చించుదామని, తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు చర్చలో భాగస్వామ్యం కావాలన్నారు. మరోవైపు శాసనమండలి కూడా వాయిదా పడింది.