టిడిపిలోకి వీరశివా రెడ్డి, చంద్రబాబు ఒప్పించారు: ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం వీరశివా రెడ్డి మాట్లాడుతూ... తాను టిడిపిలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరానని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోనే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. కడప జిల్లాలో తాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామన్నారు.
బాబు ఒప్పించారు: ఎర్రబెల్లి
బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, తెలంగాణ టిడిపి నేతలందర్నీ ఒప్పించి బాబు బిసి నేతను అధ్యక్షుడిగా చేశారని ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా చెప్పారు. తెలంగాణకి బిసి ముఖ్యమంత్రి వస్తేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమించారని... కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్, విమలక్క సహా ఎందరో విద్యార్థుల పోరాటంగానే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ద్రోహులు అయిన కొండా దంపతులను టిడిపిలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
తెరాస, కాంగ్రెసు పార్టీలకు అవకాశమిస్తే తెలంగాణ నాశనమవుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ ఇచ్చినప్పటికీ తెరాస స్వాగతించలేదని, బాబు సమన్యాయం అన్నారే గానీ తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదన్నారు. మహిళల కోసం టిడిపి ఎన్నో పథకాలు రూపొందించిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలన్నారు. ఎర్రబెల్లి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.
బిజెపితో పొత్తుపై ఎర్రబెల్లి వేరుగా మాట్లాడారు. బిజెపితో షరతులతో కూడిన పొత్తుకు తాము సిద్ధమన్నారు. బిజెపిలోని ఒకరిద్దరు స్వార్థపరులు పొత్తులను వ్యతిరేకిస్తున్నారన్నారు. పొత్తుతో రెండు పార్టీలకు లాభమన్నారు. ఆర్ కృష్ణయ్యను సిఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించలేదని చెప్పారు.
కెసిఆర్పై అంబికా కృష్ణ
కెసిఆర్ పైన, కాంగ్రెసు నేతల పైన టిడిపి నేత అంబికా కృష్ణ బుధవారం మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని చెప్పిన కెసిఆర్ ఏమంటున్నాడో వింటున్నారా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటామని, సీమాంధ్రులతో ఇంకా లొల్లి ఉందని కెసిఆర్ అంటున్నారన్నారు.
రాష్ట్రాన్ని నిలవునా చీల్చి ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేపట్టారని నిలదీశారు. చంద్రబాబు పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, సీమాంధ్రను అభివృద్ధి చేసే సత్తా బాబుకే ఉందన్నారు. కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా రావని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తమకు మధ్య నామమాత్రపు పోటీ ఉంటుందన్నారు.