ఏపీలో ఇప్పుడు హాట్ కేక్స్ అవే... రాజకీయ నేతలకు సైతం.... భారీ డిమాండ్ తో కొరత..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ గడువు రేపటితో ముగియనుంది. అయితే స్ధానిక ఎన్నికల ప్రచారం అర్ధాంతరంగా ఆగిపోవడం మాత్రం రాజకీయ నేతలకు లాక్ డౌన్ ప్రభావం లేకుండా చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలంతా ఇప్పుడు ప్రలోభాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు అత్యవసరాలపై వారి దృష్టంతా నెలకొంది. దీంతో ప్రస్తుతం జనంలోనూ ఇదే అంశం చర్చనీయాంశంగా మారుతోంది.
ఏపీలో లాక్ డౌన్- కూరగాయల పంపిణీ..
ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు రంగంలోకి దిగిపోతారు. ఓటర్లకు ఏం కావాలో తెలుసుకుని మరీ వాటిని అందించేందుకు సిద్ధమైపోతుంటారు. కానీ ఈసారి ఏపీలో విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదా పడిపోవడంతో ఇప్పుడు అభ్యర్ధులతో పాటు సాధారణ జనానికి సైతం అవసరాలు మారిపోయాయి. సాధారణ పరిస్ధితుల్లో డబ్బులు పంపిణీ చేస్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు నిత్యావసరాల సరుకులు, అందునా కూరగాయల కొరత ఏర్పడింది. రైతు బజార్లకు, రద్దీ స్ధలాలకు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామంటే వైరస్ భయం అందుకే ఇప్పుడు కూరగాయల కోసం వారు ఎదురుచూస్తున్నారు. దీంతో నేతలు కూడా కూరగాయల పంపిణీపై దృష్టిపెట్టారు.
కూరగాయలతో అభ్యర్ధుల ప్రచారం...
ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రస్తుతం అనుమతి లేదు. దీంతో కూరగాయల పంపిణీ పేరుతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు నేతలుసిద్ధమైపోతున్నారు. ఉదయం ప్రజలకు ఇచ్చిన మూడు గంటల షాపింగ్ వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ వారిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల షాపింగ్ సమయాలు దాటిన తర్వాత కూడా ఇళ్ల వద్దకే వెళ్లి కూరగాయల పంపిణీ చేపడుతున్నారు. దీంతో పాటే తమకు ఓటు వేయాలని అభ్యర్దిస్తున్నారు.
ప్రజల్లోనూ సానుకూల స్పందన..
వాస్తవానికి ఎన్నికల సమయంలో నేతలను వెతుక్కుంటూ వెళ్లి మరీ డబ్బులు తెచ్చుకునే కొందరు ఓటర్లు.. ఇప్పుడు నేతలే వాళ్ల ఇళ్ల వద్దకు వచ్చి కూరగాయలు పంపిణీ చేస్తుండటంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ప్రస్తుతం డబ్బులున్నా మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనుక్కునే పరిస్ధితి లేదు కాబట్టి ఇంటికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి మరీ కూరగాయలు తీసుకుంటున్నారు. దీంతో సదరు అభ్యర్దులకు ప్రత్యర్ధులుగా పోటీ పడుతున్న వారు సైతం ఇదే బాటను ఎంచుకుంటున్నారు.
కరోనా భయాలూ బేఖాతర్..
కరోనా భయంతో మార్కెట్లకు వెళ్లి కూరగాయలు కొనుక్కోలేకపోతున్న వారికి ఇళ్ల వద్దకే కూరగాయలు తీసుకెళ్లి పంచుతున్న నేతలు.. వీటి ద్వారా వైరస్ సోకుతుందన్న అంశాన్ని మాత్రం మర్చిపోతున్నారు. వందల సంఖ్యలో కూరగాయలను ప్యాకింగ్ చేయించి మరీ ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పంచుతుండతంతో వాటి కోసం అక్కడక్కడా జనం ఎగబడుతున్న పరిస్ధితులు ఉన్నాయి. పలుచోట్ల షాపింగ్ సమయాలు దాటిన తర్వాత కూడా వీటి పంపిణీ కొనసాగుతుండటంతో అధికారులు వీరిని ఆపలేక తలపట్టుకుంటున్నారు.