నెల్లూరులో టీడీపీ-వైసీపీ తీవ్ర ఘర్షణ: ఆ ఘటన వెనుక ప్రత్యర్థి కుట్ర?
నెల్లూరు: ఏపీలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదాలు, అవి గొడవకు దారితీస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ముఖ్యంగా జిల్లా స్థాయి నేతల్లో పార్టీల గొడవలు ఎక్కువయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మారుపూరు ఎస్సీ కాలనీలో వైసీపీ-టీడీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి.
కారణమేంటో తెలియదు కానీ.. ఇరు వర్గాలు తీవ్రంగా తలపడ్డాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన కొందరు గాయాలపాలయ్యారు. అనంతరం టీడీపీ నేతలు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లపై దాడి చేసి వైసీపీ నేతలు బంగారం దోచుకెళ్లారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గొడవకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో బైక్ దగ్ధం..:
ఏపీ బంద్ నేపథ్యంలో తిరుపతి నెహ్రూ బస్టాండ్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు బైక్కు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. దీని వెనకాల కుట్ర ఉందని మంత్రులు అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. తిరుపతికి చెందిన వైసీపీ నాయకుడి అనుచరులే పాత మోటార్ సైకిల్ను కొనుగోలు చేసి తగులబెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.