వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే: బాబు అన్యాయ పాలనకు నిదర్శమన్న జగన్
హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
హైదరాబాద్: వైసీపీలోకి వలసలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహానిచ్చేవిగా మారాయి. సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం నాడు వైసీపీలో చేరారు.
హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు ఆయన అనుచరులు పలువురు పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు.
కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవలే బీజేపీకి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేశ్ రెడ్డి కూడా త్వరలోనే వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ ను కూడా కలిశారు. మొత్తానికి పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో వైసీపీలో కొత్త ఉత్సాహాం కనిపిస్తోంది.
బాబు అన్యాయ పాలనకు ఈ చేరికలు నిదర్శనం: జగన్
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అన్యాయ పాలనకు ఈ చేరికలు అద్దం పడుతున్నాయని ఈ సందర్బంగా జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలపై చంద్రబాబును నిలదీసేందుకు ప్రజలు సిద్దమవుతున్నారని హెచ్చరించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చేరిక సందర్బంగా.. వైసీపీ నేతలు రామచంద్రారెడ్డి, పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.