డైలామా?: ఎటూ తేల్చుకోలేక.., జగన్, బాబు గాలం.. 'వీపీఆర్' ఎవరికి చిక్కుతారో!
తనకు కచ్చితమైన హామి లభిస్తేనే పార్టీలోకి వస్తానని వాళ్లతోను వీపీఆర్ అదే చెప్పారట.
Recommended Video
నెల్లూరు: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో 'వీపీఆర్' చుట్టూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా వైసీపీ వెంట నడిచిన ఆయన.. పార్టీ తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదే సమయంలో అటు టీడీపీ ఆయనకు గాలం వేసే పనిలో పడింది. నెల్లూరు లోక్ సభ టికెట్ ఇస్తామని హామి ఇచ్చింది. అయినా సరే.. ఆయన మాత్రం ఎటూ తేల్చుకోలేకపోయారు. ఓసారి టీడీపీలో చేరేందుకు సిద్దపడినా.. అనుకోని కారణాల రీత్యా అది కాస్త వాయిదా పడింది.
వైఎస్ ఓకే!... జగన్ నాట్ ఓకే!: 'వైసీపీలో చేరి చాలా పెద్ద తప్పు చేశా'
ఇన్నాళ్లకు మళ్లీ వైసీపీ నేతలు వీపీఆర్ ను బుజ్జగించడానికి రంగంలోకి దిగారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. మునుపటిలా కాకుండా ఈసారి కచ్చితంగా రాజ్యసభ సీటు వచ్చేలా చేస్తామని, అవసరమైతే లోక్ సభ సీటైనా ఇస్తామని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీపీఆర్ ఏ పార్టీలో చేరడానికి మొగ్గుచూపుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
2014లో కీలకంగా:
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ సత్తా చాటడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జిల్లా నేతలను సమన్వయం చేసి పార్టీని జనంలోకి తీసుకెళ్లడంలో చొరవ చూపించారు.
అలాగే నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోను కీలకంగా వ్యవహరించి వైసీపీ నుంచి పలువురిని కార్పోరేటర్లుగా గెలిపించుకోగలిగారు. అయితే ఆయనకు ఇస్తానన్న రాజ్యసభ సీటు ఇవ్వడంలో జగన్ విఫలమయ్యారు. ఆయనకు ఇస్తానన్న సీటును విజయసాయిరెడ్డికి కట్టబెట్టడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.
టీడీపీ గాలం:
ఒకానొక సమయంలో.. వైసీపీలో చేరి తప్పు చేశానంటూ బహిరంగంగానే వాపోయారు. అప్పటినుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వీపీఆర్ వైసీపీకి దూరంగా జరగడంతో టీడీపీ ఆయనకు గాలం వేయడం మొదలుపెట్టింది. స్వయంగా సీఎం ద్వారా ఆయనకు ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. అటు మంత్రి నారా లోకేష్ కూడా వీపీఆర్ ను అప్పట్లో ఓ హోటల్ కు పిలిపించుకుని ఏకాంతంగా చర్చలు జరిపారు. పార్టీలో ప్రాధాన్యానికి ఢోకా ఉండదని, 2019ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ సీటు ఇస్తామని హామి ఇచ్చారు.
చేరిక వాయిదా:
సీఎం చంద్రబాబు నుంచి గట్టి హామి లభించడంతో ఇక ఆయన చేరిక లాంఛనమే అనుకున్నారంతా. దానికి తగ్గట్టుగానే అప్పట్లో పార్టీలో చేరేందుకు అన్నీ ఏర్పాట్లు చేసకుని సీఎంను ఆహ్వానించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయింది. దీంతో తన చేరికను వాయిదా వేసుకున్నారు. అప్పటినుంచి మళ్లీ ఆయన చేరిక అంశం మరుగునపడుతూనే వచ్చింది. మధ్యలో ఒకటి రెండుసార్లు చంద్రబాబు, లోకేష్ లు ఆయనతో మాట్లాడినా.. పార్టీలో చేరిక మాత్రం జరగలేదు.
ఎన్నికల ముందే:
2019ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీలో చేరడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారన్న వాదన కూడా ఉంది. అప్పటిదాకా జిల్లాలో సామాజిక కార్యక్రమాల ద్వారా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఇటు వైసీపీ కూడా రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో అంటే హామిని నిలబెట్టుకోలేకపోయాం కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజ్యసభ కాకపోతే లోక్ సభకే పంపిస్తామని విజయసాయిరెడ్డి ఆయనకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.
వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు సభ్యులకు అవకాశం ఉంది. ఒక్కో అభ్యర్థికి 44మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైసీపీ నుంచి గెలిచిన 67మందిలో 22మంది పార్టీని వీడి టీడీపీలో చేరడంతో..ప్రస్తుతం 45మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన ఒక్క రాజ్యసభ సీటు మాత్రమే వైసీపీకి దక్కుతుంది. అయితే ఆలోపే వైసీపీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను లాగి ఆ సీటు కూడా దక్కకుండా చేయాలని టీడీపీ భావిస్తోంది.
అదే జరిగితే ప్రాధాన్యత క్రమం ఓటింగులో భాగంగా నాలుగో స్థానం కూడా టీడీపీ ఖాతాలో చేరుతుంది. ఈ పరిణామాలను ముందే ఎరిగిన వీపీఆర్.. ఏ పార్టీలోకి వెళ్తే తనకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందుకే రాజ్యసభ స్థానంపై ఎవరైతే కచ్చితమైన హామి ఇస్తారో ఆ పార్టీలోకే వెళ్తారని తెలుస్తోంది. పారిశ్రామికవేత్తగా ఉన్నందునా.. రాజ్యసభకు వెళ్లేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
టీడీపీ అలర్ట్
వీపీఆర్ తో వైసీపీ చర్చలు జరుపుతున్నట్టు తెలియడంతో.. అటు టీడీపీ కూడా అప్రమత్తం అయింది. రెండు రోజుల క్రితం మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలో చేరికపై ఆరా తీశారు. తనకు కచ్చితమైన హామి లభిస్తేనే పార్టీలోకి వస్తానని వాళ్లతోను వీపీఆర్ అదే చెప్పారట. దీంతో మరోసారి చంద్రబాబు, లోకేష్ ఆయనను పిలిపించుకునే మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్దిరోజులు ఓపిక పడితే వీపీఆర్ రాజకీయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.