దక్షిణాదికే ‘ఉపరాష్ట్రపతి’: రేసులో ముగ్గురూ ‘తెలుగు’వారే
ఉప రాష్ట్రపతి అభ్యర్థి కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తులను ముమ్మరం చేసింది. అయితే, ఈ రేసులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురే ముందు వరుసలో ఉండటం విశేషం.
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థి కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తులను ముమ్మరం చేసింది. అయితే, ఈ రేసులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురే ముందు వరుసలో ఉండటం విశేషం.
వీరిలో కేంద్ర సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు , తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్లు ఉన్నారు. ఆగస్టు 5న ఉప రాష్ట్రపతి స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా వీరిలో ఒకరిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
ముందు వరుసలో వెంకయ్య
కాగా, ఉపరాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడు ముందు వరుసలో ఉన్నారు. ఆయన నాలుగో సారి రాజ్యసభకు ఎంపిక కావడం విశేషం. 1998 నుంచి ఇప్పటి వరకు కర్ణాటక నుంచే మూడుసార్లు ఎంపీగా పని చేశారు. బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న వెంకయ్యనాయుడు.. 2002, 2004 మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నుంచి 1978, 1983లలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు వెంకయ్య.
మోడీ వదులుకోగలరా?
జులై 1న ఆయన 68వ పడిలో అడుగుపెట్టారు. 2022తో ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన పూర్తిగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, బీజేపీలో సీనియర్ నేతగా, మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న వెంకయ్యను ప్రధాని నరేంద్ర మోడీ వదులుకోలేరని మరో బీజేపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
ప్రధాన పోటీదారే
జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్గా పేరుతెచ్చుకున్నారు వెంకయ్య. అంతేగాక, మోడీ ప్రభుత్వంలో ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ కీలకంగా ఉన్నారు. స్మార్ట్ సిటీల పథకం, ఇతర పథకాల అమలులో ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. బీజేపీలో గానీ, రాజ్యసభలో గానీ ఎంతో అనుభవం ఉన్న వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవికి ఎంతో తగిన వ్యక్తని, ప్రధాన పోటీదారు అని మరో బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం.
తెరపైకి విద్యాసాగర్ రావు
ఎవరూ ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్, తెలంగాణకు చెందిన వ్యక్తి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుల పేర్లు కూడా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సంఘ్ పరివార్కు చెందిన విద్యాసాగర్ రావు ఏబీవీపీతో 1970లలో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. అంతేగాక, న్యాయవాదిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానితోపాటు బీజేపీలోని సీనియర్ నేతలతో విద్యాసాగర్ రావుకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఈఎస్ఎల్ నర్సింహన్: దేవుడి నిర్ణయం
తెలుగు రాష్ట్రాలతో సంబంధమున్న ఐపీఎస్ అధికారి నర్సింహన్ కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉండటం విశేషం. ఈయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోవడం గమనార్హం. దశాబ్ద కాలం క్రితం యూపీఏ హయాంలో ఛత్తీస్గఢ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నర్సింహన్ను ఎంపిక చేసి కాంగ్రెస్, విపక్షాల మద్దతు కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నర్సింహన్ను ప్రశ్నించగా.. ఏదైనా ఆ దేవుడు నిర్ణయించాల్సిందేనని అనడం గమనార్హం.
తుది నిర్ణయం మోడీ, అమిత్ షాలదే
బీజేపీ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలదే తుది నిర్ణయం కానుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరభారతంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ను ఎంపిక చేసిన నేపథ్యంలో.. దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఉప రాష్ట్రపతిగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో ఉంది.