ఏందయ్యా వెంకయ్యా..! మన దాకా వస్తే అంతేనయ్యా.. !!
హైదరాబాద్ : పెరటిలో ఉన్న మొక్క సొంత వైద్యానికి పనికి రాదట. అలాగే నీతి సూక్తులు ఎన్నైనా వల్లిస్తాం గాని తమ దాకా వస్తే మత్రం తూచ్ అనొచ్చట. ప్రస్తుతం బీజేపి నేతల పరిస్థితి ఇలాగు తయారయ్యింది. బీజేపి అందరి నేతల పరిస్థితి మనకెందుకు గాని మొన్నామద్య ఉప రాష్ట్ర పతి హోదాలో ఫిరాయింపులపై వెంకయ్య నాయుడు చేసిన చేసిన వ్యాఖ్యలు తలుచుకుంటే ఇప్పుడు నవ్వు రాక మానదు.
ఏదైనా యవ్వారం తనదాకా వస్తే గానీ దేని గురించి తెలియదంటారు.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంచుమించు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీంతో సోషల్మీడియాలో ఆయనపై నెటిజెన్లు తెగ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా.. పార్టీ ఫిరాయింపుల విషయం గురించిలెండి. మొన్నామధ్య హైదరాబాద్లో సదస్సులో పాల్గొన్న వెంకయ్యనాయుడు పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టం రావాలని, పార్టీ ఫిరాయించిన వెంటనే సదరు ప్రజాప్రతినిధికి అన్ని సదుపాయాలు పోయేలా చట్టం రావాలంటూ అసహనం వ్యక్తం చేశారు. నేరుగా ప్రస్తావించకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి ఫిరాయించడానికి ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అందరూ గ్రహించారు కూడా. ఇప్పుడు ఆయన వద్దకే ఫిరాయింపు వ్యవహారం వచ్చింది. తెలుగుదేశానికి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. ఏకంగా పార్టీని విలీనం చేయాలని రాజ్యసభ ఛైర్మన్గా ఉన్న వెంకయ్యనాయుడికే లేఖ ఇచ్చారు.
అప్పటివరకు ఫిరాయింపులపై కఠిన చట్టం రావాలని దేశవ్యాప్తంగా పలుమార్లు ప్రసంగాల్లో చెప్పిన వెంకయ్య ముందుకే ఫిరాయింపుదారులు వచ్చినట్లు అయ్యింది. చివరికి ఆయన ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయకుండానే ఆ నలుగురు టీడిపి ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. రాజ్యసభ వెబ్సైట్లోనూ వారి పేర్లు పక్కన బీజేపీ సభ్యులుగా రాశారు. ఫిరాయింపులపై ధ్వజమెత్తిన వెంకయ్య ముందుకే ఫిరాయింపు దారులు వచ్చి పార్టీ విలీనం చేయాలని కోరడంతో ఆయన కూడా ఏమీ చేయలేని సంకట స్థితిని ఎదుర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా.. రాజ్యాంగం ప్రకారం తన పని తాను చేసుకుపోవాల్సి వచ్చింది. అయ్యో.. వెకయ్యా.. ఎంత పని జరిగే..!