వెంకయ్యనే టార్గెట్: కెవిపి ప్రత్యేక హోదా బిల్లుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తూ కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర్ రావు పెట్టిన ప్రైవేట్ సభ్యుడి బిల్లు రేపు శుక్రవారం రాజ్యసభలో చర్చకు రానుంది. దానిపై ఓటింగ్ జరిగేలా చూడాలని కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై ఇప్పటికే చర్చ జరిగిందని, ఇప్పుడు నేరుగా ఓటింగు జరగాలని ఎపి కాంగ్రెసు అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు.
ఒకవేళ బిల్లు చర్చకు వస్తే బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టింది, దాన్ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తూ అప్పటి ప్రధాని చేత ప్రకటన చేయించిందీ ఆయనే. పైగా, తామే అధికారంలోకి వస్తాం కాబట్టి ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే మాట చెప్పారు. కానీ, ఇప్పుడు ఆయన మాట మార్చినట్లు కనిపిస్తున్నారు. దీంతో వెంకయ్య నాయుడిని ప్రతిపక్షాలు లక్ష్యం చేసుకుని బిజెపిని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, బిల్లు చర్చకు రాకుండా చూస్తామని బిజెపి పార్లమెంటు సభ్యుడు హరిబాబు ఇంతకు ముందు అన్నారు.
కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన బిల్లు చర్చకు వస్తుందా, చర్చ జరిగినా ఓటింగు జరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు విషయంలో బిజెపి వ్యూహం ఏమిటనేది అసలు తెలియడం లేదు. దాని నుంచి గట్టెక్కడానికి బిజెపి ఏం చేయబోతుందనేది తేలడం లేదు. అయితే, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినా లోకసభలో ఆమోదం పొందడం సాధ్యం కాదని అంటున్నారు.
బిల్లుకు సిపిఐ, సిపిఎం, ఎన్సీపి, డిఎంకె తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. పైగా, బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది. ఏ ధీమాతో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందనేది తెలియడం లేదు. ఆత్మరక్షణలో పడింది కాబట్టే మద్దతు ఇస్తుందనే వాదన కూడా ఉంది. తీరా బిల్లు చర్చకు వచ్చినప్పుడు గానీ, ఓటింగుకు వచ్చిప్పుడు గానీ టిడిపి సభ్యులు ఏం చేస్తారనేది కూడా ఊహించడానికి వీలు లేకుడా ఉంది.
సజావుగా సాగితే కాంగ్రెసుకు రాజ్యసభలో మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో కెవిపి బిల్లు గట్టెక్కే అవకాశమే ఉంది. రాజ్యసభలో గట్టెక్కినా లోకసభలో కష్టమనే ధీమాతోనే బిజెపి ఉందా అనేది కూడా తెలియడం లేదు. అయితే, ఒకవేళ అదే జరిగితే బిజెపి అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరిద్దామనే వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఏమైనా బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇదిలావుంటే, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ గురువారం లోక్సభలో అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సభలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు.
విభజన బిల్లు సమయంలో బీజేపీతో పాటు అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న నిదులను ప్రతి జిల్లాకు రూ. 200 కోట్లకు పెంచాలని కోరారు.