ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన .. వెంకయ్య నాయుడు, అమిత్ షా , సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి .. ఏమన్నారంటే
విశాఖనగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ ప్రభావంతో వేలాదిగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికి ఒక చిన్నారితో సహా ఎనిమిది మంది మరణించారు. ఇక చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది . అసలే కరోనా కష్ట కాలంలో ఎపీకి మరోఊహించని కష్టం ఈ దుర్ఘటన రూపంలో వచ్చిందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనపై ఇప్పటికే పలువురు స్పందించారు. ట్విట్టర్ వేదికగా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రధాని మోడీ , హోం శాఖా మంత్రి అమిత్ షా , భారత ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు , తెలంగాణా సీఎం కేసీఆర్ స్పందించారు. హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిస్థితి తెలుసుకుని అధికారులకు సూచనలు ఇస్తున్నారు .
ప్రధానమంత్రి కార్యాలయంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశం
తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఈ దుర్ఘటనపై స్పందన తెలియజేశారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై తాము హోం మంత్రిత్వ శాఖతోను, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీతోను మాట్లాడామని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర అధికారులతో కేంద్రం ఈ ఘటన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందని ఆయన చెప్పారు . ఆ ఘటనకు సంబంధించి ప్రతివారి రక్షణకూ తాను ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన ఈ ట్వీట్లు చేసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశాన్ని యుధ్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ... మానిటర్ చేస్తున్నామని వెల్లడి
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్రం హోం శాఖా మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఈ ఘటన తన మనసును తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇక తాము విపత్తు నిర్వహణా అధికారులతో మాట్లాడి అక్కడ పరిస్థితి తెలుసుకున్నామని చెప్పారు.ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్దిస్తున్నామని ట్వీట్ చేశారు.
స్పందించిన సీఎం కేసీఆర్ .. ఇది చాలా దురదృష్టకరం అన్న తెలంగాణా సీఎం
ఇక ఈ ఘటనపై ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు.విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఇది అత్యంత దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందన .. మనసును కలచివేసింది
ఇక ఈ దుర్ఘటన జరగటం చాలా దురదృష్టకమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందన తెలియజేశారు .విశాఖపట్టణం శివార్లలోని ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన దురదృష్టకర ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్నెంతగానో కలిచివేసిందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు . ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మండిపడ్డారు . బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు .ఇక తాను ఈ ఘటనపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్నానని ఈ విషయంలో అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వారు తెలిపారని పేర్కొన్నారు . ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు చేపట్టామని హోంశాఖ కార్యదర్శి చెప్పారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Recommended Video
ఎపట్టికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి .. అధికారులకు సూచనలు
విశాఖ ఘటనపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అడిగి వివరాలు తెలుసుకుంటుంది. ఘటనకు సంబంధించి హోంశాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్తో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలడిగారు . బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను విశాఖ పంపాలని సూచించారు. విశాఖ ఘటనలో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందగా సుమారు రెండు వేల మంది గ్యాస్ ప్రభావానికి లోనయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.