ఎందుకీ ఆక్రోశం: ముందే కొత్త నోట్లు ఎందుకు విడుదల చేయలేదో చెప్పిన వెంకయ్య
నోట్ల రద్దు నేపథ్యంలో విపక్షాలు సోమవారం నాడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం: నోట్ల రద్దు నేపథ్యంలో విపక్షాలు సోమవారం నాడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీనిపై కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పైన ఆక్రోశం, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఊగిపోయారు.
రేపటి బందును ప్రజలు తిరస్కరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నోట్ల రద్దును అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. దేశం గర్విస్తోందని, ప్రపంచం హర్షిస్తోందన్నారు. వెంకయ్య రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు.
మన్మోహన్ విఫల ప్రధాని: వెంకయ్య
మన్మోహన్ సింగ్ విఫలమైన ప్రధాని అని వెంకయ్య అన్నారు. మన్మోహన్ సింగ్కు మోడీని విమర్శించే హక్కు లేదన్నారు. నల్లధనాన్ని అరికట్టే విషయంలో అక్రమాలకు పాల్పడేవారిపై నిఘా ఉంటుందన్నారు.
దేశంలో 17.80 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉండగా నోట్ల రద్దుతో 3 లక్షల కోట్లు చెలామణిలోకి వచ్చే అవకాశం లేదన్నారు. నల్లధనాన్ని అరికడుతున్న ప్రభుత్వంపై, విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకువచ్చిన మోడీపై ప్రతిపక్షాల ఆక్రోశం ఎందుకో చెప్పాలని నిలదీశారు.
వారికి సహకరిస్తున్నారా?
విపక్షాలు బంద్కు పిలుపునివ్వడాన్ని చూస్తుంటే ఉగ్రవాదులు, డ్రగ్ మాఫియా, నల్లధనం కలిగి ఉన్న వారికి సహకరించడమేనన్నారు. నల్లధనం ఉందని, వారికి సహకరించేందుకే బంద్కు పిలుపునిచ్చారా? అని నిలదీశారు.
చంద్రబాబుకు అభినందన
నల్లధనాన్ని అరికట్టే విషయంలో అక్రమాలకు పాల్పడేవారిపై నిఘా పెట్టామని, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబును అభినందిస్తున్నామన్నారు. తాత్కాలిక కుదుపులు ఉన్నా పరిస్థితి కుదుటపడుతుందని, ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చూసుకోకుండా కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.
ముందే నోట్లను ఎందుకు విడుదల చేయలేదంటే..
పెద్ద నోట్ల రద్దుపై మోడీ తీసుకున్నది ఆకస్మిక నిర్ణయమేనని, అది అలాగే చేయాలని అన్నారు. ముందే కొత్త నోట్లు విడుదల చేయాల్సిందని అంటున్నారని, కానీ పాత నోట్లు ఉప సంహరణ అయితేనే కొత్తవి వస్తాయని, అది ఆర్బీఐ నిబంధన అని, అవినీతి జబ్బుకు మోడీ చికిత్స చేస్తున్నారన్నారు.
ముందే కొత్త రూ.500 నోట్లను విడుదల చేస్తే ఇబ్బందులు తప్పేవనేది కొందరి వాదన. అయితే, నిబంధనల ప్రకారం అలా విడుదల చేయడనికి వీలు లేదని వెంకయ్య నాయుడు తాజాగా చెప్పారు. ముందే నోట్ల విడుదల చేయలేదన్న పలువురి అనుమానాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.