హోదా కోసం అధిష్టానం వద్ద వెంకయ్య పోట్లాట! మాగంటి శపథం
విజయవాడ/న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు బీజేపీ పెద్దలతో పోట్లాడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ బుధవారం నాడు వెంకయ్య హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు.
బీజేపీలో, కేంద్రంలో వెంకయ్య అంతర్గతంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు. అయితే, ఈ విషయాలను తాము బయటకు చెప్పలేమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం విభజనకు ముందు పోరాడిన వెంకయ్య ఇప్పుడు ఎందుకు వద్దంటారని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.
బాబు మాటే..: హోదాపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు
ప్రత్యేక హోదా కింద ఎన్ని కోట్లు వస్తాయో.. అన్ని కోట్లు ప్యాకేజీగా ఇస్తామంటే తాము దానికి అంగీకరిస్తామని టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తద్వారా ప్యాకేజీకి తాము సిద్ధమన్నారు. విభజనకు వైసిపి అధినేత జగన్ దారి చూపాడన్నారు.
జగన్ ఢిల్లీలో దుష్ప్రచారం చేస్తున్నాడని మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. కాగా, టిడిపి ఎంపీలతో గత వారం జైట్లీ, వెంకయ్య సమావేశమైన సందర్భంగా కేంద్రమంత్రులు ఇద్దరి మధ్య హోదాపై వాదన జరిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
వెంకయ్య ఎదుట మాగంటి శపథం
టిడిపి సీనియర్ నేత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు పెంచిన గడ్డం చర్చకు తెర తీసింది. మాగంటి ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా లా గడ్డం పెంచడంతో.. ఆయనను ఢిల్లీలో 'ఆంధ్రా అమిత్ షా' అంటున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం మాగంటి బాబును బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఓ ప్రశ్న వేశారు. గడ్డం ఎప్పుడు తీస్తావని అడిగారు. దానికి మాగంటి బాబు.. మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదాకా గడ్డం తీ సేది లేదని చెప్పారట. దీంతో వెంకయ్య మిన్నకుండిపోయారు.