నేడు కడప జిల్లా బంద్: సీఎం రమేష్ ఆరోగ్యంపై వెంకయ్య ఆరా
కడప/న్యూఢిల్లీ: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాకబు చేశారు. ఈ మేరకు ఆయన కోల్కతా రాజ్భవన్ నుంచి కడప జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
Recommended Video
నేడు కడప బంద్
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ గత తొమ్మిది రోజులుగా సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తుండగా.. ఆయన దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు, కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కాగా, విపక్షాలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరుబాట పట్టాయి. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో శుక్రవారం కడప జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయా పార్టీలు జిల్లా బంద్ చేపట్టనున్నాయి. బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.