42ఏళ్ల అనుభవంతో చెబుతున్నా..: ఏపీ ‘రాజధాని’పై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్లో మీడియాతో ఆయన ముచ్చటించారు. రాజధానితోపాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఒక్క చోటే ఉండాలి..
ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటు ఉండాలి. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తన 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నానని అన్నారు.
వివాదం కోసం.. రాజకీయం కోసమో కాదు..
వివాదం కోసమో, రాజకీయ కోణంలోనో తన అభిప్రాయాన్ని చూడవద్దని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్రం తనను అడిగితే తాను ఇదే అభిప్రాయం చెబుతానని ఉపరాష్ట్రపతి చెప్పారు.
నా మనసు కలిచివేసింది..
‘అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతం కావాలి. నిన్న రాజధాని రైతులు నా వద్దకు వచ్చారు.. వాళ్ల భావోద్వేగం చూసి నా మనసు చలించింది' అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, మంగళవారం వెంకయ్య నాయుడును అమరావతి రైతులు కలిశారు. రాజధాని కోసం తాము భూమిలిచ్చామని, ఇప్పుడు తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందంటూ రైతులు తమ గోడును ఉపరాష్ట్రపతికి వెళ్లబోసుకున్నారు. తాను చేయాల్సింది చేస్తానని, చెప్పాల్సిన వారికి చెబుతానని వెంకయ్యనాయుడు వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈనేపథ్యంలో తాజాగా రాజధానిపై వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మూడు రాజధానులంటూ..
ఏపీకి మూడు రాజధానులు ఉంటే మంచిదే కదా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వ్యాఖ్యానించారు. జీఎన్ రావు కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే, అమరావతి, విశాఖపట్నంలలో హైకోర్టు బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. అమరావతి రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.