నిమ్మకూరులో వెంకయ్య చెప్పిన 'కొడుకు పెళ్లి' పిట్టకథ: నవ్విన చంద్రబాబు
అమరావతి: కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు, నెమ్మలూరు మధ్య బెల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్య తన ప్రసంగంలో కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ 'కొడుకు పెళ్లి' పిట్టకథను చెప్పి చంద్రబాబు సహా వేదికపై ఉన్న వారిని, ప్రజలను నవ్వించారు.
50 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తమకు ప్రజలు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారని, కాంగ్రెస్ వారు 2019 వరకూ ఆగాలని హితవు పలికిన ఆయన "వెనకటికి ఒకాయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. పెళ్లి చేయాలని తండ్రి వద్ద గొడవ పెడుతున్నాడు. పెళ్లి చేయమని... వాళ్ల నాయన అప్పుడే టైం కాలేదురా, వద్దురా తొందర పడవాకురా అన్నాడట. లేదు నాకు తొందరగా పెళ్లి కావాలి అంటూ ఊళ్లో వాళ్లందరికీ చెప్పాడట వెళ్లి... అయ్యా మా నాయిన నేను చెబితే పెళ్లి చేయడం లేదు. తొందరగా నాకు పెళ్లి అయ్యేట్టు చూడమని. ఆపై ఊళ్లో వాళందరూ వెళ్లి చెప్పారట. మీ అబ్బాయికి అంత హుషారుగా ఉంటే తొందరగా పెళ్లి చేయవయ్యా అని. దీంతో వాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తరువాత రెండేళ్లయి పోయింది. ఏం కాలేదు. మూడేళ్లయింది ఏం కాలేదు... (ఈ సమయంలో చంద్రబాబు, ఆయన పక్కనున్న సుజనా చౌదరి నవ్వాపు కోలేకపోయారు) ఐదేళ్లయింది ఏం కాలేదు. పదేళ్లయింది ఏం కాలేదు. ఏందిరా అంత గొడవ జేస్తివి, మీ నాయన ప్రాణం తీస్తివి. పదేళ్లయినా ఇంకా ఏం కాలేదంటే ఎలారా? అంటే నాకు ఇంకో చాన్సిచ్చి చూడండి, ఈ సారి చూపిస్తా నా తడాఖా అన్నాడట" అంటూ అని అక్కడున్న అందరినీ నవ్వించారు.
ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్న నాయకులంతా, ఆ కేటగిరీకి చెందిన వాళ్లే, అర్థం చేసుకోండని వెంకయ్య నాయుడు అన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రం రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. రూ.6 వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైందన్నారు.
రాత్రి సమయంలో 3 కిలో మీటర్ల దూరం చూడగలిగే లెన్స్ను బెల్ పరిశ్రమ తయారుచేస్తోందన్నారు. ఈ సంస్థ ఉత్పతుల్లో 87 శాతం రక్షణ శాఖకు చెందినవే అన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నేతలు ఏపీకి ప్రత్యేకహోదా తప్ప మరేమీ అక్కర్లేదని అంటున్నారన్నారు.
హోదా కోరిన నేతల్లో తాను కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. హోదాతోపాటు 28 కోరికలు కోరితే, వాటిలో 27 కోరికలు నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. మిస్సైల్కు చెందిన కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూములు తీసుకోకుండా కంపెనీలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.
Laid foundation for BEL Night Vision equipment's unit at Nimmakuru, Andhra with a cost of Rs300 cr along with @ncbn and @yschowdary today
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 19, 2016