నేను ఏపీ నుంచి గెలవలేదు, చొక్కాలు మార్చే వాళ్లు నన్నంటారా: వెంకయ్య ఉగ్రరూపం
తాడేపల్లిగూడెం: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం నాడు యూపిఏ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ విద్యాసంస్థను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. యూపిఏను ఏకి పారేశారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలను ఉద్దేశించి అన్నారు. నన్ను అడ్డుకుంటానంటే నాకు అభ్యంతరం లేదని, కానీ తాను వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందన్నారు.
ఏపీని యూపీఏ అన్యాయంగా విభజించిందన్నారు. ఓ ప్రాంతం వారి గొంతు కోశారన్నారు. తెలంగాణ ఏర్పడాలి, ఏపీకి సౌకర్యాలు కావాలని తాను పార్లమెంటులో వాదించానని చెప్పారు. ఇరు రాష్ట్రాల తెలుగువారి కోసం సభలో ఎవరు గొంతు చించుకున్నారో అందరికీ తెలుసునన్నారు.
ప్రజలకు అన్నీ తెలుసునని, కానీ ఎవరో ఇచ్చే సర్టిఫికేట్ తనకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. గడ్డిబొమ్మలు పెట్టి తన దిష్టిబొమ్మలు తగలబెడితే తాను లెక్కచేయనని చెప్పారు.
ఏపీ నుంచి పోటీ చేయలేదు.. తెలుగువాడిగా
నేను ఈ రాష్ట్రం నుంచి (ఏపీ) ఎంపీగా పోటీ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని, కానీ తెలుగువాడిగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎదుర్కొన్నానని చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే వ్యతిరేకించానని నిప్పులు చెరిగారు.
ఏపీకి అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది లేదని నేని సభలో ఆనాడు అడ్డుపడ్డానని చెప్పారు. ఏపీని ముందుచూపు లేకుండా విభజించి ఇప్పుడు నన్ను విమర్శించడం విడ్డూరమన్నారు. కెమెరాలు బంద్ చేసి, డోర్లూ మూసేసి విభజన చేశారని మండిపడ్డారు.
50 ఏళ్లు ఏం చేశారు
ఏడాది లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ అడుకుతోందని, మరి యాభై ఏళ్లు మీరేం చేశారని నిలదీశారు. ఏపీకి న్యాయం జరగాలని కోరుకున్నది ఎవరో అందరికీ తెలుసునని, అది తానేనని చెప్పారు. అది అందరికీ తెలుసునని చెప్పారు. ఏపీకి విశాఖ జోన్ వస్తుందన్నారు.
ఏడాది అయినా హామీలు అమలు కాలేదని చెప్పడం విడ్డూరమన్నారు. సంవత్సరంలో అమలైతై యాభై ఏళ్లు వారు ఎన్నో చేయాలి కదా అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం, వర్ణం, వర్గం పేరుతో యాభై ఏళ్లు నష్టం చేశారన్నారు.
కేంద్రంతో సఖ్యతగా ఉండి అన్నీ సాధించుకోవాలన్నారు. యాభై ఏళ్లు ఎంతో నష్టం చేసిన వాళ్లు ఇప్పుడు ఐదేళ్లు ఓపిక పట్టలేకపోతున్నారన్నారు.
వారసత్వ రాజకీయాలతో రాలేదు, పుట్టినప్పటి నుంచి ఇదే పార్టీలో
నేను వారసత్వ రాజకీయాలతో రాలేదని రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. కుల, మత ప్రాతిపదికన తాను ఎప్పుడూ గెలవలేదన్నారు. పుట్టినప్పటి నుంచి నేను ఇదే పార్టీలో ఉన్నానని చెప్పారు. ఇదే పార్టీలో చస్తానన్నారు.
చొక్కాలు మార్చేవాళ్లు, బేరం చేసేవాళ్లు
నీతికి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. మా వద్దకు వచ్చి బేరం చేసిన వాళ్లు, ఎప్పుడు ఏ చొక్కా వేసుకుంటారో తెలియని వాళ్లు, నిత్యం పార్టీలు మార్చేవారు తమను అడగడం విడ్డూరమన్నారు. తమ వద్దకు వచ్చి బేరం చేసి వేరే పార్టీలోకి వెళ్లిన వారు మమ్మల్ని విమర్శిస్తారా అన్నారు.
హామీలు నెరవేరుస్తాం
ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు. నాడు సభలో విభజన సమయంలో వెంకయ్య మాట్లాడకుంటే దిక్కేలేదన్నారు. మీరు ఆనాడు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు ఏపీ ఎక్సుప్రెస్ తీసుకొచ్చామన్నారు. ఏడాదిలో ఏపీకి ఎంతో సాయం చేశామని, ఇంకా చేస్తామన్నారు.నిత్యం పంచాలి.. పంచాలి అంటారు కాని పెంచకుండా పంచడం ఎలా అన్నారు.
ప్రత్యేక హోదా పైన చర్చలు
ప్రత్యేక హోదా పైన చర్చలు జరుగుతున్నాయని, తుది చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏపీకి అన్యాయం జరగనివ్వమని చెప్పారు. కేంద్రం ఏపీకి ఏం చేసిందో కొద్ది రోజుల్లో ప్రజల ముందు పెడతామని చెప్పారు. ఏపీకి ఇంకా ఎంతో చేస్తామన్నారు.