వైసీపీ కొత్త ఎంపీలకు అప్పుడే కీలక పదవులు: పిల్లి సుభాష్కు ఇండస్ట్రీస్, మోపిదేవికి కోల్
అమరావతి: రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కీలక పదవులు లభించాయి. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురితో పాటు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న మరో ఎంపీకి పదవిని కల్పించారు. ఈ నలుగురితో పాటు దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాలు, పార్టీల నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యసభ సభ్యలకూ పదవులను కేటాయించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. వారికి వివిధ స్టాండింగ్ కమిటీల్లో సభ్యత్వాన్ని కల్పించారు.
వైసీపీ ఎంపీలకు కేటాయించిన శాఖలు ఇవే
వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్కు కీలకమైన పరిశ్రమల స్థాయీ సంఘంలో సభ్యత్వాన్ని కల్పించారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను పర్యవేక్షించడం, పెట్టుబడులను సమీక్షించడం, వాటికి కేటాయించిన భూములు.. వంటి పలు అంశాలను ఆరా తీసే అధికారాలు ఈ స్టాండింగ్ కమిటీకి ఉంటుంది. మోపిదేవి వెంకటరమణకు బొగ్గు, ఉక్కు శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలో సభ్యత్వాన్ని కల్పించారు. అయోధ్యా రామిరెడ్డిని పట్టణాభివృద్ధి స్థాయీ సంఘంలో సభ్యుడిగా నియమించారు. ఐటీ స్టాండింగ్ కమిటీలో పరిమళ్ నత్వానీకి సభ్యత్వాన్ని కల్పించారు.
కేకే, సురేష్ రెడ్డిలకు
తెలంగాణ నుంచి అధికార టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కే కేశవరావుకు కూడా పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా నియమితులు అయ్యారు. కేఆర్ సురేష్ రెడ్డిని ప్రజా ఫిర్యాదు చట్టం, న్యాయ వ్యవస్థకు సంబంధించిన కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు వారిని నామినేట్ చేసినట్లు రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. వివిధ శాఖలకు సంబంధించిన స్టాండింగ్ కమిటీల్లో ఖాళీగా ఉన్న సభ్యత్వాలను భర్తీ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
Recommended Video
సింధియాకు హెచ్ఆర్డీ, రంజన్ గొగొయ్కు విదేశీ వ్యవహారాలు..
దేశవ్యాప్తంగా ఎన్నికైన సభ్యులందరికీ వివిధ స్టాండింగ్ కమిటీల్లో సభ్యత్వాన్ని కల్పించారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని పుచ్చుకొన్న జ్యోతిరాదిత్య సింధియాకు మానవ వనరుల అభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీలో చోటు కల్పించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్కు విదేశీ వ్యవహారాలు, మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడకు రైల్వేలు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గెకు వాణిజ్య శాఖల స్థాయీ సంఘాల్లో సభ్యత్వం లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్కు రక్షణ మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘంలో చోటు కల్పించారు.