అమీర్ ఖాన్ వ్యాఖ్యలు బాధించాయి: వెంకయ్య, 'వెళ్తే భారత్లో జనాభా తగ్గుతుంది'
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు స్పందించారు. అమీర్ వ్యాఖ్యల పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తో, తెలిసో, తెలియకో ఆయన చేసిన వ్యాఖ్యలు తమను చాలా బాధించాయన్నారు.
తీవ్ర ఇబ్బందికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రజలు తప్పుదోవలోకి మళ్లించబడితే, మరికొంతమంది తప్పుదోవపడుతున్నారన్నారు. ఈ కేటగిరిలోకి వచ్చిన వారిని నేరుగా తాను ప్రస్తావించనని చెప్పారు. కానీ ఇతర ఏ దేశాల్లో లేని చక్కటి పరిస్థితులు భారత్లో ఉన్నాయన్నారు.
ప్రపంచంలోనే భారత్ సహనవంత దేశమన్నారు. భారత్లో సహనం ఎక్కువ, భారత ప్రజలు సహనపరులన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన ఘర్షణలు తగ్గుతూ ఉన్నాయన్నారు. అమీర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేశారు.
అమీర్ ఖాన్ వ్యాఖ్యల పట్ల పెను దుమారం చెలరేగింది. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, రామ్ గోపాల్ వర్మ, రవీనా టాండన్, పరేష్ రావల్, రిషీకపూర్లు అమీర్ ఖాన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. దేశంలో ఒకవేళ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటే కథానాయకుడిగా సరిచేయాలని హితవు పలికారు.
అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తగవని, అలాంటివి దేశానికి, ప్రధానికి అపకీర్తిని తీసుకు వస్తాయని కేంద్రమంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. భారత్ మినహా అమీర్ కుటుంబం ఇంకెక్కడకు వెళ్తుందో చెప్పాలని బిజెపి నేత షాన్ వాజ్ హుస్సేన్ నిలదీశారు.
అమీర్ ఖాన్ అలా మాట్లాడటమే సహనానికి నిదర్శనం అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అమీర్ ఖాన్ దేశం విడిచి వెళ్లకుండా ఎవరూ ఆపలేదని, అలా వెళ్తే కనీసం భారత్ జనాభా తగ్గుతుందని గోరఖ్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.