మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు వెంకయ్య నాయుడు ఫిదా
న్యూఢిల్లీ: హీరో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాకు కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు ఫిదా అయిపోయారు. శ్రీమంతుడు సందేశాత్మక చిత్రం, సినిమా చూస్తుంటే తన చిన్నతనం గుర్తుకొచ్చిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
బుధవారం వెంకయ్యతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు, శ్రీమంతుడు చిత్ర నిర్మాత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సినిమాను ప్రశంసించారు. నేటి చిత్రాలలో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది, శ్రీమంతుడులో విజ్ఞానం, వినోదం ఉందని చెప్పారు.
కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరవవద్దు అని ఆయన తెలిపారు. స్వచ్ఛభారత్ను ప్రమోట్ చేస్తూ సినిమా తీయాలని శ్రీమంతుడు నిర్మాతను ఈ సందర్భంగా వెంకయ్య కోరారు.
కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు'గా వచ్చిన మహేశ్ అందరి అభిమానాన్ని పొందుతున్నాడు. ఈ చిత్రం విడుదలైన రోజు నుండి పాజిటివ్ టాక్తో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ఎంపీల కోసం గుంటూరు టీడీపీ ఎంపీ ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలను కూడా ‘శ్రీమంతుడు' ప్రత్యేక షోకు ఆహ్వానించారు. ఈ ప్రత్యేక షోను మంగళవారం సాయంత్రం 6.45నిమిషాలకు ప్రదర్శించారు. గల్లా జయదేవ్ ప్రిన్స్ మహేశ్కు స్వయానా బావ అనే విషయం తెలిసిందే.