నెహ్రూపై వెంకయ్య పొగడ్తలు, రాహుల్పై సెటైర్లు
నెల్లూరు: జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడల్లో యువత నడవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి వెంకయ్య శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నెహ్రూను ఏ ఒక్క పార్టీకో పరిమితం చేయడం సరికాదన్నారు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నీతి, నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయన్నారు. మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు.
దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉందని, ప్రతి ఒక్కరు సమాజం కోసం జీవించేలా అలవాటు పడాలని వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు ప్రాంగణంలో జరిగిన నెహ్రూ జయంతి వేడుకలో వెంకయ్య అన్నారు. నెహ్రూ దేశాభివృద్ధికి పునాది వేైశారన్నారు. బ్రిటిష్ వారిని దేశం నుండి బయటకు పంపించడంలో, పంచవర్ష ప్రణాళికలు రూపొందించడంలో ఆయన పాత్ర కీలకమన్నారు.
విద్యావ్యవస్థలో పటిష్ట మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. పిల్లలు అంటే నెహ్రూకు ఎంతో ప్రేమ అన్నారు. నెహ్రూ, గాంధీ, మోడీల సూచన మేరకు అందరు పరిశుభ్రత అలవాటు చేసుకోవాలన్నారు.
కాగా, గురువారం రోజు వెంకయ్య చెన్నైలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నారనీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలే ఇందుకు చక్కని నిదర్శనమన్నారు. గురువారం సాయంత్రం చెన్నైలోని కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ(సీఎల్ఆర్ఐ) ప్రాంగణంలో నాయుడమ్మ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన హాజరయ్యారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని డాక్టర్. కండేకొల్లే యుంకెల్లాకు అందజేసిన అనంతరం వెంకయ్య మాట్లాడారు. అభివృద్ధి, మంచి పాలన బీజేపీ ముందున్న లక్ష్యాలన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీని నిందించడమే పనిగా పెట్టుకుందని వెంకయ్య నాయుడు విమర్శించారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారన్నారు. ఆయనను ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. మీరు ఎందుకు పట్టించుకుంటున్నారని మీడియాతో చమత్కరించారు. రాహుల్ గాంధీ పైన ఎవరికి నమ్మకం లేదన్నారు.