పార్టీ మారడంపై బాబు-కేసీఆర్లకు వెంకయ్య చురకలు, మోడీ చెప్పినట్లుగా..
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సన్మాన సభలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును టీ సుబ్బిరామిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారే విధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నచ్చిన వారు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పు లేదన్నారు. కానీ పదవుల్లో ఉంటూ వేరే పార్టీలో చేరడం మాత్రం సరికాదని వెంకయ్య చెప్పారు.
చంద్రబాబు, కేసీఆర్లకు చురకలు
ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీల్లో చేరడమే కాకుండా, మంత్రి పదవులు కూడా పొందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు, కేసీఆర్కు పరోక్షంగా వెంకయ్య చురకలు తగులుతున్నాయి.
Recommended Video
ఏపీ, తెలంగాణ గురించి చెప్పట్లేదంటూ
వెంకయ్య మాట్లాడుతూ.. పార్టీ మారాలనుకుంటే, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులను వదులుకొని వేరే పార్టీలో చేరవచ్చునని హితవు పలికారు. తాను ఏపీ, తెలంగాణల గురించి చెప్పడం లేదని, దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే అన్నారు.
ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే
ఏదైనా చర్చించుకోవాలి
చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఐదు రోజుల్లో రాజ్యసభ, లోకసభల్లో ప్రశ్నోత్తరాలు కూడా జరగకపోవడం దారుణం అన్నారు. సభను వాయిదా వేయడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. ఏదైనా చర్చించుకోవాలని, సభలు సజావుగా సాగాలన్నారు.
బీజేపీపై బాబు 'చేరికల' అసహనం: సాయంపై ట్విస్ట్, లెక్కతో ఇరకాటంలో బాబు, కొత్త ప్రశ్నలు!
ఇంగ్లీష్ వద్దనడం లేదు కానీ
తెలుగు భాష గొప్పతనం గురించి వెంకయ్య చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పడం లేదని, కానీ మాతృభాషను మరిచిపోవద్దన్నారు. మమ్మీ, డాడీ అంటే ఆ మాటలు పెదవుల చివరి నుంచే వస్తాయని, అమ్మ, నాన్న అంటే లోతు నుంచి వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా, దక్షిణ తెలంగాణలో మరో రకంగా ఉంటుందన్నారు. దట్స్ ది బ్యూటీ... యూనిటీ ఇన్ డైవర్సిటీ.. అని వెంకయ్య అన్నారు.
మోడీ చెప్పినట్లుగా నేర్చుకోవాలి
ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఉత్తరాదివారు దక్షిణాది రాష్ట్రాలను, దక్షిణాదివారు ఉత్తరాది భాషలను నేర్చుకోవాలని వెంకయ్య అన్నారు. మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస.. ఇవన్నీ కాపాడుకోవాలన్నారు. మన భాషలో రమ్యత ఉందన్నారు. రోశయ్యపై ప్రశంసలు కురిపించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. సత్కారం మన సంప్రదాయం అన్నారు. ఏ పదవుల్లో ఉన్న ఆయన ఆ పదవికి న్యాయం చేశారని చెప్పారు. క్రమశిక్షణలో ఏదైనా సాధ్యమన్నారు. ప్రజా జీవనంలో కట్టుబాటు ముఖ్యమన్నారు. సినిమా తాత్కాలికమైన ఆకర్షణ అని చెప్పారు.