వెంకయ్య నోరు విప్పాలి, చంద్రబాబు మోసం: హోదాపై శైలజానాథ్
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ నేత శైలజానాథ్ విరుచుకుపడ్డారు. పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్య నాయుడు నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన వల్లనే ఎపికి ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పుకున్న వెంకయ్య నాయుడు ఇప్పుడేమంటారని ఆయన అడిగారు.
ఎన్డీఎలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలనూ కలుపుకుని కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన సూచించారు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆయన విమర్శించారు. ఎపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. టిడిపి నాయకులు ప్రధాని మోడీని చూసి భయపడుతున్నారని ఆయన అన్నారు. మోడీ ఇంటి ముందు ధర్నా చేయగలరా అని ఆయన టిడిపి నేతలను అడిగారు. కేంద్ర మంత్రులు మోడీపై తిరుగుబాటు చేయాలని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి న్యాయం చేయలేరని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు పోరాటం చేయలేరని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదా కోసం మోడీపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు.
ప్రత్యేక హోదాపై తమ పార్టీ రాజకీయ పోరాటం చేస్తుందని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కాలేజీల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.