రైతులపై ఇలాంటి వ్యాఖ్యలా?: రుణమాఫీ ఫ్యాషన్ అయిందన్న వెంకయ్య!..
గడిచిన మూడేళ్లలో 36వేల నుంచి 40వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. రైతు రుణమాఫీని ఫ్యాషన్ అంటూ వెంకయ్య ఎద్దేవా చేయడాన్ని సీతారాం ఏచూరి తీవ్రంగా తప్పుపట్టారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రైతు రుణమాఫీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ గా మారిపోయిందని వ్యాఖ్యానించారు. అత్యంత గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడే రుణమాఫీ చేయాలి తప్పితే.. ఇదే తుది పరిష్కారం కాదని చెప్పారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతు రుణమాఫీపై ఇలా స్పందించారు. రైతులకు రుణమాఫీ చేయడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితుల్లో ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుందని అన్నారు. వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైతు రుణమాఫీని ఫ్యాషన్ అయిపోయిందని అభివర్ణించడం.. రైతులను అవమానించే చర్యగానే భావించాల్సి ఉంటుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
గడిచిన మూడేళ్లలో 36వేల నుంచి 40వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. రైతు రుణమాఫీని ఫ్యాషన్ అంటూ వెంకయ్య ఎద్దేవా చేయడాన్ని సీతారాం ఏచూరి తీవ్రంగా తప్పుపట్టారు. కాగా, ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారానికై రోడ్డెక్కిన అన్నదాతలపై ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో.. ఐదుగురు రైతులు తూటాలకు బలైపోయారు. ఇలాంటి తరుణంలో వెంకయ్య నాయుడు రైతులను తక్కువ చేసేలా మాట్లాడటం దుమారం రేపేదిగానే మారింది.
ఇదిలా ఉంటే, తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతుల రుణమాఫీ దాదాపు పూర్తయింది. ఈ పథకానికి సంబంధించిన ఆఖరి విడత నిధులు రూ.4,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ లో విడుదల చేసింది. ఇక ఏపీకి సంబంధించి మొత్తం ఐదు విడుతల్లో రుణమాఫీ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు మూడో విడుతను కూడా పూర్తి చేయలేదన్న విమర్శలున్నాయి.
ఇటీవల కర్ణాటక సర్కార్ సైతం రూ.50 వేల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అటు యూపీ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి.