నరసరావుపేటకు ఎంతో గొప్ప చరిత్ర: 'ఉద్యమాలకు ఊపిరిగా, పౌరుషానికి ప్రతీకగా నిలిచింది'
అమరావతి: అభివృద్ధి బాటలో నరసరావుపేట దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో రెండో రోజు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ముందుగా రైల్వే అండర్ బ్రిడ్జి, టౌన్హాల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ శతాబ్ధి ఉత్సవాల ద్వారా ప్రజలు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు కంచుకోట... కలల కాణాచి నరసరావుపేట అని పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఉద్యమాలకు ఊపిరిగా, పౌరుషానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ఉద్యమాలను చవి చూసిందన్నారు.
అనేక వర్గాల కోసం నరసరావుపేటలో శ్మశాన వాటికలను నిర్మించారని, జిల్లా కేంద్రం గుంటూరు అయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాసించేది మాత్రం నరసరావుపేటేనని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. కన్న తల్లిని, జన్మభూమిని, దేశాన్ని మరచిన వారు మానవులే కాదన్న వెంకయ్య, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ నరసరావుపేటను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని మెచ్చుకున్నారు.
నరసరావు పేట ప్రాంతం నుంచి ఎందో మంది మహానుభావులు రాజకీయాల్లో ఉన్నారని, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా, కాసు వెంకట కృష్ణారెడ్డి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు ఈ ప్రాంత వ్యక్తే కాగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే కావడం కాకతాళీయమన్నారు.