కాంగ్కు వెంకయ్య క్లాస్, అధిష్టానంపై మండిపడ్డ సబ్బం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ మొదట సొంతింటిని దిద్దుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. తెలంగాణ అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారని ఆయన చెప్పారు. బిల్లు విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పారని అన్నారు.
సవరణలు చూసే సమయం లేదా: సోమిరెడ్డి
సవరణలు చూసే సమయం కూడా జివోఎంకు లేదా అని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ ఎవరి అడిగారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేయాల్సింది జంతర్ మంతర్ వద్ద కాదని, సోనియా ఇంటి ముందు అని సూచించారు.
సిఎం దీక్ష వద్ద సమైక్య నినాదాలు చేసిన కేంద్రమంత్రులు జివోఎం వద్ద లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కావాలి అదే ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లుపై అభిప్రాయం చెబితే పట్టించుకోరా అని మండిపడ్డారు. అసెంబ్లీకి విలువ లేకుంటే రద్దు చేయాలన్నారు.
సరికాదు: కాసు
శాసన సభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టడం అనైతికమని మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తును వేరే భాషలు మాట్లాడే నేతలు ఎందుకు నిర్ణయించాలని ప్రశ్నించారు. తప్పుల తడకగా ఉన్న బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన నిలదీశారు. రెండు ప్రాంతాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే విభజనపై అపోహలు తొలగిపోతాయన్నారు.
కేంద్రమంత్రులు వెళ్తోంది సరైన దారి కాదు: సబ్బం
కేంద్ర మంత్రులు వెళ్తున్న దారి సరైంది కాదని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. కేంద్ర మంత్రులు జివోఎం చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు పట్టించుకోని జివోఎం ఇప్పుడు పెద్ద మార్పులు చేస్తుందని భావించడం లేదన్నారు. కేంద్ర మంత్రులు చేస్తున్న డిమాండ్లు ప్రజలకు చెప్పుకునేందుకు పని కొస్తాయే తప్ప, వాటి వల్ల ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదని అన్నారు. శాసనసభ పంపిన అభ్యంతరాలను చదివేందుకు కూడా సమయం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు తాయిలాలు ఇవ్వాలని చూస్తున్నారని, ఈ పని ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి తమ వ్యూహం మార్చుకుంటామని, వాళ్లకు నచ్చినట్లు వాళ్లు చేస్తే తమకు నచ్చినట్లు తాము చేస్తామన్నారు.