'అద్భుతం.. ప్రతి భారతీయుడు ఆంగ్కోర్ వాట్ దేవాలయాన్ని చూడాలి'
హైదరాబాద్: ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఆంగ్కోర్ వాట్ దేవాలయాన్ని ప్రతి భారతీయుడు సందర్శించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని చూడాలన్నారు.
వెంకయ్య నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కంబోడియా వెళ్లారు. ఆంగ్కోర్ వాట్ దేవాలయాన్ని సందర్శించేందుకు కంబోడియా వెళ్లారు. 11వ శతాబ్దంలో పల్లవరాజు సూర్యవర్మన్2 ఈ అద్భుతమైన విష్ణు ఆలయాన్ని నిర్మించారనీ, దీని నిర్మాణానికి 37 సంవత్సరాలు పట్టిందని వెంకయ్య తెలిపారు.
మూడు అంతస్తుల్లో వందల ఏళ్ల క్రితమే నిర్మితమైన ప్రధాన ఆలయంలోని శిల్పాలు, నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని వెంకయ్య తెలిపారు. ఆంగ్ కోర్ వాట్ దేవాలయం అద్భుతమన్నారు.
విదేశీ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ఆలయంలో నిర్మాణ వాస్తు, శాసనాలు, హిందూమత పురాణాలు, రామాయణ, మహాభారతంతోపాటు హిందూ సంస్కృతి గురించి స్థానిక గైడ్లు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. వెంకయ్య కుటుంబ సభ్యులతో మరో దేవాలయాన్ని కూడా సందర్శించారు.
వెంకన్న సేవలో సురేష్ ప్రభు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు దంపతులు ఆదివారం నాడు దర్శించుకున్నారు.
ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ కృష్ణమూర్తి, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ స్వాగతం పలికారు.