5 కి.మీ. నడక, ఇందిరాగాంధీ ప్రచారం చేసినా గెలిచిన వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్నగ్రామంలో జన్మించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకానున్నారు. ఎన్డిఏకే మెజార్టీ ఉంది. ఈ స్థానానికి విపక్షాలు గోపాలకృష్ణగాంధీని పోటీగా నియమించారు. తెలుగు,
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్నగ్రామంలో జన్మించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకానున్నారు. ఎన్డిఏకే మెజార్టీ ఉంది. ఈ స్థానానికి విపక్షాలు గోపాలకృష్ణగాంధీని పోటీగా నియమించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా వెంకయ్య మాట్లాడతాడు. తన ప్రసంగాలతో ఆకట్టుకొనే శక్తి ఉంది.చిన్నతనం నుండే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో వెంకయ్యనాయుడు 1949 జూలై 1వ, తేదిన జన్మించాడు. రంగయ్య, రమణమ్మ వెంకయ్యనాయుడు తల్లిదండ్రులు. సామాన్య రైతు కుటుంబం వెంకయ్యనాయుడిది. వెంకయ్యనాయుడు పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పేరును ఖరారుచేయడంతో ఆయన స్వగ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ విషయం తెలిసన వెంటనే గ్రామస్థులు మిఠాయిలు పంచుకొన్నారు. తమ గ్రామం పేరును దేశానికి తెలిసేలా చేశారని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. చిన్నతనం నుండి క్రమశిక్షణతో ఆయన జీవితాన్ని గడిపాడు.
బిజెపిలో అత్యున్నత పదవులు పొందినా, కేంద్ర మంత్రిగా ఉన్నా కానీ, తాను పుట్టిన ఊరిని ఆయన ఏనాడూ కూడ మర్చిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగిపోయి ఉండే మనస్తత్వం ఆయనదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు.
చదువుకోసం ఐదు కిలోమీటర్లు నడక
చిన్నతనంలో చదువుకొనేందుకు వెంకయ్యనాయుడు ఐదుకిలోమీటర్ల దూరంపాటు ఆయన కాలినడకన వెళ్ళేవారు. ఎన్ని ఇబ్బందులున్నా ఆయన చదవును మాత్రం వదులుకోలేదు. పట్టుదలతో ఆయన చదువుకొన్నారని చవటపాలెం గ్రామస్థులు చెబుతున్నారు. చవటపాలెం చిన్నగ్రామం. ఈ గ్రామం నుండి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపిక చేయడం పట్ల గ్రామస్థులు ఆనందంతో ఉన్నారు. 10వ, తరగతి వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా హైస్కూల్లో ఆయన చదువుకొన్నారు. విఆర్ కళాశాలలో ఆయన డిగ్రీ చదువుకొన్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన న్యాయవిద్యను అభ్యసించారు. మొదటి నుండి ఆయన ఎబివిపిలో చురుకుగా పనిచేశారు. ఏనాడూ కూడ ఆయన పార్టీని వీడలేదు. ఒకేపార్టీలో కొనసాగారు.
జై ఆంధ్ర ఉద్యమంలో కీలకం, తెలంగాణకు మద్దతు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1972లో చోటుచేసుకొన్న జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించారు. ఆనాడు జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టుడికించాయి. కొంతకాలంపాటు ఓ ఉద్యమం సాగితే, మరికొంతకాలంపాటు మరో ఉద్యమం సాగింది. అయితే జై ఆంధ్ర ఉద్యమంలో వెంకయ్య కీలకంగా వ్యవహరించారు.అయితే 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మాణం చేసింది బిజెపి. 2014 ఎన్నికలకు ముందు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లు విషయంలోనూ ఆయన పార్టీ అభిప్రాయంతో ఆయన విబేధించలేదు. జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏపీకి ప్రత్యేక హోదా , నిధులు ఇవ్వాలని ఆయన రాజ్యసభలో పట్టుబట్టారు.
ఇందిరాగాంధీ ప్రచారం చేసిన వెంకయ్య గెలిచారు
1977లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాందీ ఎమర్జెన్సీని విధించారు.అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వెంకయ్య గళమెత్తారు. ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన తన గళమెత్తారు.ఈ సమయంలో ఆయన జైలుకు కూడ వెళ్ళారు. అప్పట్లో ఆయన బిజెపి యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో వెంకయ్యనాయుడు ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ సమయంలో ఇంధిరాగాంధీ ఉదయగిరి అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేసింది. వెంకయ్యనాయుడును ఓడించాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇందిరాగాంధీతో ప్రచారం చేయించారు. అయినా ఆ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు విజయం సాధించారు.
ఎన్టిఆర్ ప్రభంజనంలో కూడ వెంకయ్య విజయం
1983లో ఎన్టిఆర్ టిడిపిని ఏర్పాటుచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టిఆర్ ప్రభంజనం కలిగింది. అయితే ఆ సమయంలో కూడ ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుండి వెంకయ్యనాయుడు రెండోసారి ఆ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాదెండ్లభాస్కర్రావు ఎన్టిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించిన సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో టిడిపి, వామపక్షాలతో కలిసి ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కమ్యూనిష్టులు, కాషాయపార్టీ నేతలు కలిసి పనిచేశారు.
అంచెలంచెలుగా ఎదిగిన వెంకయ్య
బిజెపిలో అంచెలంచెలుగా వెంకయ్యనాయుడు ఎదిగారు. 1988లో ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఆయన బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళారు. జాతీయ రాజకీయాల్లో కూడ ఆయన కీలకంగా వ్యవహరించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 1996 నుండి 2000 వరకు ఆయన బిజెపి జాతీయఅధికార ప్రతినిధిగా పనిచేశారు. 1998 నుండి ఇప్పటివరకు ఆయన రాజ్యసభలో ఎంపీగా కొనసాగుతున్నారు. 1999లో వాజ్పేయ్ మంత్రివర్గంలో ఆయన గ్రామీణాభివృద్దిశాఖను నిర్వహించారు. మోడీ మంత్రివర్గంలో కూడ ఆయన కీలకమంత్రి పదవులను నిర్వహిస్తున్నారు. అయితే 2002 లో ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో దేశంలో బిజెపి ఓటమిపాలు కావడంతో ఆయన జాతీయ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు.