హోదా పదేళ్లు కావాలన్నది నిజమే, సవతి ప్రేమ ఉండదు: వెంకయ్య
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్నది నిజమేనని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు దేవేందర్గౌడ్ రాసిన 'ఉద్యమబాట' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. బీసీల అభివృద్ధికి దేవేందర్ గౌడ్ కృషి చేశారన్నారు. దేవేందర్ గౌడ్ రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని అన్నారు.
దేవేందర్గౌడ్ రాసిన పుస్తకం చూసి భవిష్యత్ తరం స్ఫూర్తి పొందాలన్నారు. కుల, మత ప్రాంత బేధాల్లేకుండా ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీనే నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు.
కేంద్రానికి ఏ రాష్ట్రంపైనా సవతి తల్లి ప్రేమ ఉండదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెంకయ్య స్పష్టం చేశారు. ఇరురాష్ట్రాలు మాకు సమానమేనని తెలిపారు.
రానురాను అసెంబ్లీ, పార్లమెంట్ ప్రమాణాలు తగ్గిపోతున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఈశ్వరయ్య, ఎంపీ వి హనుమంతరావు, నేపాల్ ఎంపీ తమాంగ్, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు.
వెంకయ్యనాయుడుకి స్కోచ్ జీవిత సాఫల్య పురస్కారం
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు స్కోచ్ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది. పేదరిక నిర్మూలన కోసం ఆయన చేస్తున్న కృషికి మెచ్చే జీవిత సాఫల్య పురస్కారం అందజేసినట్లు స్కోచ్ ప్రతినిధులు తెలిపారు.