'వెంకయ్యకు ఏపీలో పోటీ చేసి, గెలిచే దమ్ముందా', షెడ్లలో పని చేస్తాం: అశోక్ బాబు
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం నాడు సవాల్ విసిరారు. వెంకయ్య ఏపీలోని 25 లోకసభ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవొచ్చన్నారు.
సిపిఐ సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో బలముందని చెప్పుకుంటున్న వెంకయ్య నాయుడు ఎంపీగా గెలిచి చూపించాలన్నారు. ప్రత్యేక హోదా అంశంలో ఏపీ ప్రజలను మోసం చేశారన్నారు.
రాజధానిలో సౌకర్యాలు కల్పించాలి: అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీల కోసం అవసరమైతే ఉద్యమిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. అవసరమైతే వాటి కోసం ఉద్యమిస్తామని, అయితే ఉద్యమాలతో పాలనాపరమైన ఇబ్బందులు కలిగించదల్చుకోలేదని చెపంపారు.
ఏపీ రాజధానికి తరలి లావాలని ఉద్యోగాలకు చెప్పామని అశోక్ బాబు చెప్పారు. అయితే, ప్రభుత్వ పరంగా సదుపాయాలు కల్పించవలసి ఉందని చెప్పారు. అవసరమైతే తాము షెడ్లలో కూర్చొని అయినా పని చేస్తామని చెప్పారు.
కానీ, దాని వల్ల ప్రజలకు ఇబ్బంది మాత్రం కలగవద్దని అభిప్రాయపడ్డారు. జోనల్ విధానం లేకపోతే రూరల్ ఉద్యోగులు ఇబ్బంది పడతారని ఆయన చెప్పారు. జోనల్ విధానం యథాతథంగా ఉంటుందని చెప్పారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.