రాజాలు విద్యను దానం చేస్తే...ఆనం సోదరులు దాన్ని దోచుకున్నారు:టిడిపి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
నెల్లూరు:వెంకటగిరిలో పోటీ స్మగ్లర్ల ఢీ అంటూ ఆనం చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీవ్రంగా ప్రతిస్పందించారు. విద్యని దోచుకొని ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబం ఆర్థికంగా ఎదిగిందని ఎమ్మెల్యే రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు.
నెల్లూరులో ఎమ్మెల్యే రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆనం రామనారాయణ తీరును దుయ్యబట్టారు. డ్రామాలు ఆడటంలో ఆనం రామనారాయణరెడ్డి మాయల ఫకీరునే మించిన నటుడని రామకృష్ణ ఎద్దేవా చేశారు. అయితే వెంకటగిరిలో ఆనం డ్రామాలు ఎక్కువ రోజులు సాగవని ఎమ్మెల్యే రామకృష్ణ తేల్చేశారు.
నెల్లూరు జిల్లాలో డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ ఆనం సోదరులని ప్రజలకు అందరికీ తెలుసని ఎమ్మెల్యే రామకృష్ణ వ్యంగాస్త్రాలు సంధించారు. గతంలో రాపూరు నియోజకవర్గంగా ఉన్న సమయంలో ఆనం రామనారాయణరెడ్డిని ఆ ప్రాంత ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించగా, చివరకు ఆ నియోజకవర్గమే లేకుండా చేసిన ఘనుడు ఆనం రామనారాయణ రెడ్డి అని సెటైర్లు విసిరారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త నాటకం ఆడేందుకు వచ్చాడని అన్నారు.
ఒకవేళ అతను గెలిస్తే ఈసారి రాపూరు మండలమే లేకుండా చేస్తాడని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వని ఆనం ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని డెల్టాగా మారుస్తామని హామీలు ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. ఆనం మంత్రిగా ఉన్న సమయంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నానని, తెలుగు గంగ ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని ఆనంను కోరితే అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడన్నారు. అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని డెల్టాగా మారుస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు.
వెంకటగిరి రాజాలు దానం చేసిన వీఆర్సీ కాలేజీని అక్రమంగా తమ స్వాధీనం లోకి తెచ్చుకొని ఆనం కుటుంబం పెద్ద ఎత్తున డబ్బు సంపాదించిందన్నారు. అప్పట్లో రాజాలు విద్యను దానం చేస్తే ఆనం సోదరులు దాన్ని దోచుకొని సొమ్ములు సమకూర్చుకోవడం దారుణమన్నారు. ఆ కాలేజ్ కు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తే కాలేజ్ ఇక తమ ఆధీనంలో ఉండదని...అలా కాలేజ్ మీ చేతుల్లో ఉండనీయకుండా చేస్తున్నారనే కోపంతో సిఎం చంద్రబాబు మీద అలిగి వైసిపిలో చేరావని రామకృష్ణ ఆరోపించారు. ఆనం సోదరుల వల్ల తలెత్తిన ఇలాంటి పరిస్థితులను స్థానిక ప్రజలు అసహ్యించుకుంటున్నారని...రాజాలు దానం చేసిన కాలేజీని ఇకనైనా వదిలేయమని వెంకటగిరి పౌరుడిగా తాను కూడా ఆనంకి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఇలా దొడ్డిదోవన రాజాల ఆస్తిని దోచుకున్న ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరిలో పోటీచేసే అర్హత ఎలా ఉంటుందని ఎమ్మెల్యే రామకృష్ణ నిలదీశారు. కేవలం ఆస్తులు సంపాదించుకునేందుకే పార్టీలు మారే ఆనం కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత లేదని తేల్చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చంద్రబాబే దశా దిశ అన్న ఆనం రామనారాయణ రెడ్డి మళ్లీ ఈరోజున ఆయనను రాక్షసుడిలాగా చిత్రీకరించాలని చూడటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. వెంకటగిరి స్మగ్లర్లపై పోటీకి ఢీ అంటున్న ఆనంకు అసలు స్మగ్లర్లు ఎవరో 2019 ఎన్నికల్లో ప్రజలే నిరూపించి చూస్తారని రామకృష్ణ వ్యాఖ్యానించారు.