ఎట్టకేలకు అవకాశం!:గుంటూరు మిర్చియార్డ్ ఛైర్మన్ గా వెన్నా సాంబశివరెడ్డి
గుంటూరు:ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఛైర్మన్ గా టీడీపీ నేత వెన్నా సాంబశివరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెన్నా సాంబశివారెడ్డి గతంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీకి ఎంతో కాలంగా వెన్నా సాంబశివరెడ్డి సేవ చేస్తున్నా ఆయనకు ఎలాంటి అవకాశం రాలేదని ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగానైనా ఆయనకు ఈ పదవి దక్కడంపై కొన్ని వర్గాల్లో నెలకొని ఉన్న అసహనం తగ్గే అవకాశం ఉంది.
గుంటూరు మిర్చియార్డు నూతన చైర్మన్ గా సాంబశివారెడ్డి నియామకమయ్యారు. ఇప్పటి వరకు మన్నవ సుబ్బారావు యార్డ్ చైర్మన్ గా కొనసాగగా ఆయన పదవి కాలం పూర్తవడంతో నూతన చైర్మన్ గా వెన్న సాంబశివారెడ్డి నియామకం అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. మరో వారం రోజుల్లో పాలకవర్గం మొత్తం ప్రకటిస్తామని మంత్రి పుల్లారావు ఈ సందర్భంగా తెలిపారు.
వాస్తవానికి మన్నవ సుబ్బారావు పేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తెరమీదకు వచ్చినప్పుడే సాంబశివారెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. పైగా స్థానిక ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డితో సహా చాలామంది స్థానిక నేతలు వెన్నా సాంబశివారెడ్డికే మద్దతు పలికారు. అయితే సామాజిక సమీకరణాలు, మంత్రులతో, పార్టీ అధినేతతో వ్యక్తిగత పలుకుబడి కారణంగా చివరకు ఆ అవకాశాన్ని మన్నవ సుబ్బారావే దక్కించుకున్నారు.
అయితే వెన్నా సాంబశివరెడ్డి సాత్వికత, కష్టించి పనిచేసే మనస్తత్వం, టిడిపి కష్టకాలంలో విధేయతతో ఆయన పనిచేసిన తీరు, పార్టీ కోసం నష్టపోయిన విధానం, ఇలాంటి వ్యక్తికి పార్టీ అధికారంలోకి వచ్చినా పదవి ఇవ్వకపోవడంతో స్థానికంగా ఆయన సామాజికవర్గంలో నెలకొన్న అసంతృప్తి వెరసి ఇప్పుడు ఆయనకు పదవి అనివార్యంగా కల్పించాల్సిన పరిస్థితి తెచ్చాయనుకోవచ్చు. కారణాలేమైనా గుంటూరు జిల్లా రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న వెన్నా సాంబశివారెడ్డిని టిడిపి ఎట్టకేలకు గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం గమనార్హం.