బాలయ్య ఇలాకాలో ఏపీ హోదా కోసం వేణుమాధవ్ సైకిల్ ర్యాలీ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సినీ నటుడు వేణుమాధవ్ హిందూపురంలో గురువారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీపంలోని కిరకెర నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేణుమాధవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని మండిపడ్డారు.
ఏంటమ్మా! అప్పుడలా..ఇప్పుడిలానా??: కర్ణాటకలో పురంధేశ్వరికి షాకిచ్చిన తెలుగు రైతు
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే సైకిల్ యాత్రలో పాల్గొన్నట్లు వేణుమాధవ్ తెలిపారు. నాలుగేళ్లు విశ్వాసంగా ఉన్నా ఫలితం లేకపోవడంతో పోరాటం తప్పలేదని చెప్పారు. కేంద్రం చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు హిందూపురం గ్రామీణ మండలం కిరికెర నుంచి సైకిల్యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ మళ్లీ గెలిస్తే అరగుండు గీయించుకొంటానని ఓ వైసీపీ నాయకుడు అన్నాడని, తమ నాయకులు చందాలు వేసుకొని ఖర్చులకు ఇస్తారని తిరుపతికి వెళ్లి పూర్తి గుండు తీయించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రప్రజల ప్రయోజనాల కోసం దీక్ష చేస్తున్నారని, తెలుగుజాతి అండగా నిలవాలని కోరారు.
వేణుమాధవ్ సతీమణి శ్రీవాణి, నాయకులు జేఈ వెంకటస్వామి, ఎంపీపీ సుభద్రమ్మ, జడ్పీటీసీ ఆదినారాయణ, అశ్వర్థనారాయణరెడ్డి, మహేంద్రరెడ్డి, నాగభూషణం, శ్రీనివాసరెడ్డి, ఆనంద్, బసప్ప, హనుమంతరాయుడు తదితరులు వేణుమాధవ్ వెంట ఉన్నారు.
హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడంతోపాటు ఒక రోజు దీక్ష కూడా చేసిన విషయం తెలిసిందే.