పవన్కు రాజభోగమే, కానీ, సీఎం కాలేరు: బాబుకు పదవీగండంపై వేణుస్వామి సంచలనం
Recommended Video
హైదరాబాద్: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్పై వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడని, ఇందుకు ఆయన జాతకం సహకరించదని చెప్పారు.
అయితే, ఆయనకు ప్రత్యర్థుల నుంచి గట్టి కౌంటర్లు రావడం ఆయన స్టూడియో నుంచి వెళ్లిపోవడం గమనార్హం. ఇప్పటికే సినీ క్రిటిక్ కత్తి మహేష్.. పవన్పై వ్యాఖ్యలు చేసి అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
పవన్కు రాజయోగం లేదు
పవన్ కళ్యాణ్కు రాజభోగమే తప్ప.. రాజయోగం లేదని వేణు స్వామి వ్యాఖ్యానించారు. దీంతో స్పందించిన జనసేన కార్యకర్త కిరణ్ తీవ్రంగా విభేదించారు. ఇక ఆ సమయంలోనే డిస్కషన్ కు వచ్చిన జనవిజ్ఞానవేదిక సభ్యులు పీవీ రావు కలగజేసుకుని.. వేణు స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. వేణుస్వామి మాటల గారడీలు చేస్తున్నారని, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
వేణుస్వామి నెం.1 మోసగాడు
అంతేగాక, గతంలో వేణుస్వామి.. ఆగస్టు 2017 తరువాత తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు వస్తారని, నరసింహన్ వెళ్లిపోతారని జోస్యం చెప్పారని, అది జరగలేదని గుర్తు చేశారు. అలాగే ‘బిగ్ బాస్' షోలో విజేతగా నవదీప్ గెలుస్తాడని, శివబాలాజీకి జాతకం అనుకూలంగా లేదని చెప్పారని అన్నారు. వేణు స్వామి నంబర్ వన్ మోసగాడని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదని తీవ్రంగా స్పందించారు.
అప్పుడు వెంకయ్య సీఎం అవుతారన్నారు..
ఈ సమయంలో వేణు కల్పించుకుని.. తనను పవన్ కళ్యాణ్పై మాట్లాడాలని సదరు టీవీ ఛానల్ పిలిపించిందని, డిస్కషన్ను మారుస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికలకు ఏడాదిన్నర ముందే పవన్ గురించి ఎలా చెబుతారని, గతంలో వెంకయ్యనాయుడు సీఎం అవుతారని తప్పుడు జోస్యం చెప్పారని చర్చవేదికలో పాల్గొన్న పీవీ రావు మండిపడ్డారు.
ఎమ్మేల్యేను అవుతానా? అంటూ వేణు మాధవ్
ఈ చర్చలో పాల్గొన్న సినీ నటుడు వేణుమాధవ్.. తన డేటాఫ్ బర్త్ చెప్పి, తాను ఎమ్మెల్యేగా గెలుస్తానా? అని ప్రశ్నించాడు. తాను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి వేణు స్వామి సమాధానం ఇస్తూ.. ఈ జాతకుడిని 2012 నుంచి అనారోగ్యం పీడిస్తోందని, లివర్ సమస్యలు వస్తాయని, సినిమా అవకాశాలు తగ్గుతాయని అన్నారు. 2020 వరకూ ఎమ్మెల్యే అవకాశం లేదన్నారు.
వేణుస్వామిని ఏకేసిన వేణు మాధవ్
వేణుస్వామి వ్యాఖ్యలపై వేణు మాధవ్ మాట్లాడుతూ, ‘నాయనా బంగారుతండ్రీ... నీకు దమ్ముంటే వచ్చి నా దగ్గర నీవు డీఎన్ఏ టెస్టులు తీసుకో... నాకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని. సెకండ్ థింగ్.. నీవల్లేమీ కాదు. నువ్వేమీ చెప్పలేవు. నువ్వు మీసాలకు రంగేసుకుని మిగలాల్సిందే మా అయ్యగా... కలరింగ్ ఎక్కువుంది. ఆయన చెప్పిన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధం. సెకనుకు ఓ మాట మారుస్తే ఎలాగయ్యా?' అంటూ తీవ్రంగా స్పందించారు. కాగా, వేణును ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు, గెలువరని వేణుస్వామి అన్నారు.
చంద్రబాబుకు పదవీ గండం సమయంలో..
తాను తన ఫేస్బుక్ ఖాతాను కూడా డియాక్టివేట్ చేశానని, తాను పబ్లిసిటీ కోసం ఏమీ చేయడం లేదని, తనకు పబ్లిసిటీ అవసరం లేదని వేణుస్వామి అన్నారు. తాను ప్రముఖులతోపాటు సామాన్యులకు కూడా జోతిష్యం చెబుతానని అన్నారు. పవన్, చంద్రబాబు, బాలయ్యపై గురించి కూడా చెప్పాను. చంద్రబాబునాయుడుకు పదవీ గండం వచ్చినప్పుడు తానే ఇంటికి వెళ్లి పూజలు చేశానని తెలిపారు. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు.
తొలిపూజ నేనే చేశా.. పవన్ తెలుసు
తాను 1991లోనే తొలి సినిమాకు పూజ చేశానని వేణుస్వామి చెప్పారు. సుస్వాగతం సినిమాకు కూడా తానే పూజ చేశానని, తనకు పవన్ కళ్యాణ్ తెలుసునని అన్నారు. కాగా, తనను కావాలని ఛానల్కు పిలిపించి అవమానిస్తున్నారని వేణు స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నమ్మే వాళ్లే తన దగ్గరికి వస్తారని అన్నారు. తనను పవన్ కళ్యాణ్పై మాట్లాడాలని పిలిచారని గట్టిగా అరుస్తూ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.