బొండా వర్సెస్ అంబటి: బూతు పురాణమేనా..
నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత కూడా మాటల యుద్ధం రాజుకుంటూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో అదుపు తప్పి నోరు జారిన పలు సందర్భాలు ఉండనే ఉన్నాయి.
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత కూడా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం రాజుకుంటూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో అదుపు తప్పి నోరు జారిన పలు సందర్భాలు ఉండనే ఉన్నాయి.
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసిపి నాయకులు నోరు పారేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తక్కువేమీ తినలేదు. కానీ, ఆ తర్వాత కూడా మాటల యుద్ధం శ్రుతి మించిపోతుంది.
ఓ టెలివిజన్ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసిపి నాయకుడు అంబటి రాంబాబు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు తమ వాదనల్లో హద్దులు దాటి వ్యవహరించారు.
చర్చా కార్యక్రమంలో వారిద్దరు...
నంద్యాల ఉపఎన్నికలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే అంశంపై ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పాల్గొన్నారు. వారి మధ్య వివాదం నడిచిన తీరు హద్దులు దాటిన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
అదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై...
‘మంత్రి ఆదినారాయణరెడ్డి నిక్కర్ ఊడదీస్తానంటూ ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పుకాదా? నిక్కర్ ఊడదీసి ఏం చూస్తారు?' అని ఉమ అన్నారు. దానికి అంబటి రాంబాబు రెచ్చిపోయి - ‘మీకు చూపిద్దామనేమో! ఆదినారాయణరెడ్డి నిక్కర్ ఊడదీసి చంద్రబాబుకు చూపిద్దామని. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి టీడీపీలోకి చంద్రబాబు తీసుకెళ్లారు కదా! అందుకని, నిక్కర్ ఊడదీయించి చంద్రబాబుకు చూపిద్దామని. జగన్ గారు చూడటానికి కాదు' అని అన్నారు.
ఇలాగేనా అంటూ...
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే తాను గుండు చేయించుకుంటానని, గెలిస్తే రోజా గుండు చేయించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మండిపడ్డారు. చౌకబారు మాటలు, చౌకబారు రాజకీయాలు అని వ్యాఖ్యానించరు. ‘గుండును, బోండాను చూపించి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నీ బోండాను, నీ గుండును నీ దగ్గరే అట్టేపెట్టుకో. చెప్పేది విను.. సభ్యత, సంస్కారం ఉండాలి దేనికైనా!' అని అన్నారు.
ఇందుకేనా ఎన్నుకుంది...
బోండా ఉమ అనే వ్యక్తి ఓ శాసనసభ్యుడని, ఈయన గుండు కొట్టించుకోవడమేంటి? రోజా గుండు కొట్టించుకోవడమేంటి? మీ గుండ్లు చూసేందుకేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందని అంబటి రాంబాబు అన్నారు. ఏదైనా సవాల్ చేయాలనుకుంటే - ‘రాజకీయ సన్యాసం చేయండి' అనే మాటలు అనాలి గాని, గుండ్లు చేయించుకోవడమేంటి? అని అన్నారు. ‘మీరు గెలిస్తే, రోజా గారు గుండుకొట్టుకుంటే చూడాలని ఆనందంగా ఉందా? ఏంటీ వికృతమైన ఆనందం? నాకు అర్థం కాలేదు. నీకు సమ్మగా ఉంటే నువ్వు గుండు చేయించుకో..సంస్కారం లేకుండా ఈ గుండ్లు కొట్టించుకునే పద్ధతి ఏంటీ? సభ్యత, సంస్కారం ఉండాలి? ఒక మంచి విషయాన్ని చర్చించాల్సింది పోయి.. గుండులు, బోండాలు.. ఏంటీ? మీరు ఒక్క మాట మాట్లాడితే, నేను వంద మాటలు మాట్లాడగలను' ఆయన విరుచుకపడ్డారు.