మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్డేటా చెక్
గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై చోటు చేసుకున్న దాడి వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరగడానికి ముందు పరిణామాలు.. అనంతరం సంభవించిన ఘటనలపై మినిట్ టు మినిట్ ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా- రేపో, మాపో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలను పోలీసులు కలుస్తారని తెలుస్తోంది.
కాల్డేటా ద్వారా ఆరా...
మాచర్ల వెళ్లడానికి ముందే తాము అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమా, బుద్ధా వెంకన్న వెల్లడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసులు తమకు రక్షణ కల్పించలేదని, అధికార వైఎస్ఆర్సీపీ నాయకులకు అమ్ముడుపోయారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో వారిద్దరి కాల్ డేటాను పోలీసులు పరిశీలించబోతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. బాధ్యతులైన పోలీసులు ఎవరో గుర్తించడంతో పాటు బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారు? విజయవాడకు ఎలా వచ్చారు? దాడికి ముందు, తరువాత ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాపై నిఘా..
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని, పుకార్లను వ్యాపింపజేస్తున్నారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా వేశామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని అన్నారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా సోషల్ మీడియాలో సమాచారాన్ని పోస్ట్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోనివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేసినట్లు తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది పోలీసులను మోహరింపజేస్తామని అన్నారు.