ముద్రగడ తప్పా, ఒప్పా: పవన్ కల్యాణ్ను మరోసారి లాగిన విహెచ్
రాజమండ్రి: కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసేది తప్పో ఒప్పో పవన్ కల్యాణ్ చెప్పాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. ముద్రగడ దీక్షపై చిరంజీవి ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేతగా ఉన్న పవన్ ఇప్పటివరకు ఎలాంటి స్పందనా కనబరచకపోవడంతో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది
ఇదిలావుంటే, కాపుల కోసం ఎవరో అడిగారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయడం లేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పోరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. తుని ఘటనలో అరాచకం సృష్టించివారిని ప్రభుత్వానికి అప్పగిస్తాని గతంలో ముద్రగడ పద్మనాభం చెప్పిన విషయాన్ని ఆయన శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుర్తు చేశారు.
కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదకాపు విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన చెప్పారు. సివిల్స్ శిక్షణ తీసుకునే అభ్యర్థులకు నెలకు రూ.10 వేలు, ఢిల్లీలో శిక్షణ తీసుకునే వారికి మాత్రం వసతి సౌకర్యం కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.
కాపుల అభివృద్ధికి కాపు సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. విదేశాల్లో చదువుకునే కాపు విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా 10లక్షలు మరో 10 లక్షలు బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. బలిజ, తెలగ, వంటరి కులస్తులను కూడా అన్నివిధాల ఆదుకుంటామని రామానుజయ వెల్లడించారు.