సొంత జిల్లాలోనే..: కిరణ్పై విహెచ్, జగన్పై ఫైర్
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు మంచి రాజకీయవేత్త అని అనుకున్నానని, చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ హైదరాబాదులో సీమాంధ్ర జిల్లాల నుంచి మనుషులను తెచ్చి సమైక్యాంధ్ర అనడం మానుకోవాలని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు చెందినవారు కనీసం 30 శాతమైనా ఉండాలి కదా, తెలంగాణ వాళ్లు లేకుండా సమైక్యాంధ్ర ఏమిటని ఆయన జగన్ను ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారని, 41 మంది శాసనసభ్యులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా వద్దకు పంపించారని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల నాయకుడు అశోక్ బాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఇతర ప్రాంతాలవారికి ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. జులై 30వ తేదీన సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాతనే సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైందని ఆయన అన్నారు.
ఇష్టం లేకున్నా కలిసి ఉండాలనడం వ్యభిచారమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సమైక్యవాదం మానసిక వ్యభిచారంలాంటిదని అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ కలిసి ఉండాలని అనడం మానసిక వ్యభిచారమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు రాజయ్య, మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారు.