టైమ్ బాగుండి చంద్రబాబు సీఎం అయ్యారు.. జగన్ ఇంకో నాలుగు రోజులు ఆగుంటే..! : వీహెచ్
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. పార్టీ విషయాలను ప్రస్తావిస్తూనే, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ పై ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. 'టైమ్ బాగుండి చంద్రబాబు సీఎం అయ్యారని' ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వీహెచ్. ఒకప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ లో తన కింద పనిచేసిన వ్యక్తి అని టైమ్ కలిసిరావడంతో సీఎం అయ్యారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసిన వీహెచ్, జగన్ కాంగ్రెస్ నుంచి బయటికెళ్లడానికి తానెంత మాత్రం కారణం కాదన్నారు.
జగన్ కాంగ్రెస్ ని వీడడానికి ప్రధాన కారణం కేవీపియే అని చెప్పిన వీహెచ్, ఓవైపు వై.ఎస్ మృతదేహం పక్కనుండగానే కేవీపీ సంతకాల ప్రక్రియకు తెరలేపారని విమర్శించారు. దానివల్లే కథంతా అడ్డం తిరిగిందని, జగన్ ఇంకో నాలుగు రోజులు వేచి చూసుంటే మంచి అవకాశం లభించేదని పేర్కొన్నారు.
జగన్ ని సీఎం చేయడానికే కేవీపీ తాపత్రయపడ్డారని, సంతకాల సేకరణ చేసిన కేవీపీ బాగానే ఉన్నా.. జగన్ మాత్రం ఆ ఊరు, ఈ ఊరంటూ ఊర్లు పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు.
ఇక తెలంగాణలో పార్టీ విషయానికొస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అదే జరిగితే తెలంగాణలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా 2019 ఎన్నికల వరకు తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తాం అని కుండబద్దలు కొడుతున్నారు వీహెచ్.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర కాంగ్రెస్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పారు వీహెచ్. ఇక తన ఫాలోయింగ్ గురించి ప్రస్తావిస్తూ.. తనకు తెలంగాణతో పాటు ఆంధ్రాలోను ఫాలోయింగ్ ఉందని, తను ఆంధ్రాకి వెళ్తే అక్కడి జనం కూడా తనను చూడడానికి గుమిగూడుతారని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ అంతటా పర్యటించబోతున్నట్టుగా ప్రకటించారు.