షర్మిల అర్థం మార్చింది, బాబు-కెసిఆర్ పోటీ: విహెచ్, మహేష్, ప్రకాశ్రాజ్లు గ్రేట్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఓదార్పు యాత్ర పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మంగళవారం విమర్శలు గుప్పించారు.
సంవత్సరాల తరబడి పరామర్శ యాత్ర చేస్తూ అసలు ఓదార్పు యాత్ర అర్ధాన్నే మార్చేశారని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలలో పోటీ పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో గ్రామాలు దత్తత తీసుకున్న సినీ నటులు ప్రకాశ్ రాజ్, మహేష్ బాబుకు విహెచ్ అభినందనలు తెలిపారు.
కాగా, ప్రస్తుతం షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆమె యాత్ర పైన విమర్శలు గుప్పించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం పొడిగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఇందుకేనా: జీవన్ రెడ్డి
హామీలు, ప్రకటనలకు పరిమితం కావడానికేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైనా రైతుల సంక్షేమం గురించి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.
పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కూడా కేసీఆర్కు లేదన్నారు. రైతు ఆత్మహత్యల విషయంలో టీడీపీ ప్రభుత్వంలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. చైనా నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకురాగలిగితే మంచిదేనని, ఇదే సమయంలో చైనా పర్యటన మీద ఉన్న ఆసక్తిలో 10 శాతమైనా రైతులమీద ఉంటే బాగుండేదన్నారు.