సీఎం జగన్కు వెంకయ్య హెచ్చరిక: పద్దతి మార్చుకోండి: లేకుంటే అదే జరుగుతుంది..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్కు ఉప రాష్ట్రపతి వెంకయ్య అతి సున్నితంగా హెచ్చరిక చేసారు. తప్పులు చేస్తున్నారు...సరిదిద్దుకోండి లేకుంటే జరిగే నష్టం అదే అంటూ స్పష్టం చేసారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పార్టీ ఎంపీలతో కలిసి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాద పూర్వకంగా కలిసారు. సీఎం జగన్..ఉపరాష్ట్రపతి అయిన తరువాత వెంకయ్యను అధికారికంగా కలవటం దాదాపుగా ఇదే తొలిసారి. ఆ సమయంలో ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధులు..ప్రాజెక్టుల విషయంలో సహకరించారని జగన్ కోరారు. దీనికి ఉప రాష్ట్రపతి సైతం సమ్మతించారు. అదే సమయంలో వెంకయ్య నాయుడు సీఎం జగన్కు తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేసారు. మీరు మార్చుకోవాల్సిన తీరు అంటూ అన్ని విషయాలను వివరించి చెప్పారు. అన్నీ విన్న జగన్ సైతం తన ఆలోచనలను వివరించారు. అయితే, వెంకయ్య నాయుడు నేరుగా ముఖ్యమంత్రికి కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేయటంతో పార్టీ ఎంపీల్లో ఇది ఇప్పుడు ఆసక్తి కరమైన చర్చకు దారి తీసింది.
వెంకయ్యతో జగన్ భేటీ సమయంలో...
రాజకీయాల్లో అడుగు పెట్టిన సమయం నుండి జగన్ ఏనాడు వెంకయ్య నాయుడుతో కలవలేదు. ఆయన జాతీయ స్థాయిలో కీలక నేతగా ఉన్నా.. అనేక మార్లు జగన్ సైతం ఢిల్లీ వెళ్లినా ఏనాడు వెంకయ్యతో సమావేశం కాలేదు. అయితే, ఎన్డీఏ హయాంలో రాష్ట్రపతి అభ్యర్దిగా రమ్నాధ్ కోవింద్కు వైసీపీ మద్దతిచ్చిన సమయంలో ఆయన్ను వెంటబెట్టుకొని వెంకయ్య నాయుడు హైదరాబాద్ వచ్చారు. తొలి సారిగా అక్కడే ఈ ఇద్దరూ కలుసుకున్నారు. అయితే, ఆ సమయంలో రాజకీయంగా ఎటువంటి చర్చలు సాగలేదు. ఆ తరువాత ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ఖరారు చేసిన తరువాత కూడా వైసీపీ మద్దతిచ్చింది. దీనికి ప్రతిగా వెంకయ్య నాయుడు జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ..టీడీపీ పొత్తు విషయంలోవెంకయ్య నాయుడు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయం ఓ వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక, ఇప్పుడు వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి హోదాలో ..జగన్ ఏపీ ముఖ్యమంత్రి హోదా లో ఉండటంతో..ఇద్దిర మధ్య మర్యాద పూర్వక భేటీ జరిగింది. ఆ సమయంలో ఏపీలో తమ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన బిల్లులు వాటి లక్ష్యాలను వివరించటంతో పాటుగా ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం జగన్ వివరించారు.
సీఎం జగన్ను హెచ్చరించిన వెంకయ్య..
ఈ భేటీలో భాగంగా.. గత రెండు నెలల కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తావించి నట్లు సమాచారం. అధికారంలోకి రాగానే తీసుకుంటున్న నిర్ణయాలు తొందరపాటుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే తెలుగు దేశం అయిదేళ్ల కాలంలో చేసిన తప్పుల వలన ఆ పార్టీ పరాజం పాలైన విషయాన్ని వెంకయ్య నాయుడు ప్రస్తావిం చారు. మీరు అవే తపపులు చేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారని జగన్తో చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఎవరు అధికారంలో ఉన్న నిర్మాణాత్మక రీతిలో పాలన చేస్తే తప్పకుండా సహకారం ఉంటుందని..అలా కాకుండా విధ్వంసక రీతితో పని చేస్తే సాయం చేయటం కష్టమంటూ వెంకయ్య నాయుడు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యల పైన సీఎం జగన్తో సహా అక్కడ ఉన్న నేతలు విస్మయానికి గురయ్యారు. దీనికి ప్రతిగా సీఎం జగన్ సైతం తాను రెండు నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాల వెనుక కారణాలను వెంకయ్య నాయుడుకు వివరించే ప్రయత్నం చేసారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నామని..అందులో భాగంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ వివరించటానికి జగన్ ప్రయత్నించగా..అన్ని విషయాలు తనకు తెలుసంటూ వ్యాఖ్యానించిట్లు సమాచారం.
వెంకయ్య హెచ్చరికల వెనుక..
ఉప రాష్ట్రపతి హెచ్చిరక చేసినా..అందులోని భావం మాత్రం టీడీపీ బలపడేందుకు అవకాశం ఇస్తున్నారనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేది అర్దం అవుతోంది. ప్రజా వేదిక కూల్చివేత...పీపీఏల విషయంలో సమీక్ష..పోలవరం నిర్మాణంలో నవయుగ సంస్థలను పనులు ఆపివేయాలంటూ ఆదేశించటం.. ఇసుక కొరత.. వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత..రాజధాని పనులు నిలిపివేయటం వంటి వాటి పైనే వెంకయ్య నాయుడు పరోక్షంగా హెచ్చరికలు చేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో పోస్టుల కేటాయింపుల విషయంలోనూ గతంలో టీడీపీ ఒక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చిందని..ఇప్పుడు జగన్ సైతం అదే తప్పు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు అనేక మంది విమర్శలు చేసారు. వీటిని సైతం దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ సీఎం జగన్కు సూచనలతో కూడిన హెచ్చిరక చేసారని చెబుతున్నారు. టీడీపీ నేతలు సైతం జగన్ చేస్తన్న తప్పులే తమకు ఆయుధంగా మారుతాయనే ధీమాలో కనిపిస్తున్నారు. మరి..గతంలో టీడీపీ అధినేతతో సన్నిహిత సంబంధాలు ఉన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీలో టీడీపీ బలపడేందుకు అవకాశం ఇస్తున్నారు..అంటూ ముందుగానే జగన్ను హెచ్చరిచటం ద్వారా..ఖచ్చితంగా జగన్ తన నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం.. వెంకయ్య నాయుడు మాటల్లో అంతర్యం లోతుగా అధ్యయనం చేయాలని పరిస్థితి ఏర్పడిందని పార్టీ సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు.